ఛత్తీస్గఢ్ ఓటర్లకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వరాల జల్లు కురిపించారు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. కాంకేర్ జిల్లాలోని భానుప్రతాప్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు.
దేశంలో కుల గణన చేపట్టేందుకు ఎందుకు భయపడుతున్నారంటూ ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో కుల గణన చేపడతామన్నారు. ఛత్తీస్గఢ్లో గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేర్చామని చెప్పారు.
గిరిజనులను 'ఆదివాసి' అనే పదం స్థానంలో 'వనవాసి' అనే పదాన్ని ఉపయోగించడంపై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వనవాసి అనే పదాన్ని ఉపయోగించడం అంటే ఆదివాసీలను బీజేపీ అవమానించడమేనని, వారి సంస్కృతి, చరిత్ర, భాషపై దాడి చేసినట్లే అవుతుందన్నారు.
చత్తీస్గఢ్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిలేని కూలీలకు ఏటా రూ.10 వేలు అందజేస్తామని చెప్పారు.
రైతులు, కూలీలతో మాట్లాడినప్పుడు తమకు ప్రస్తుతం రాజీవ్ గాంధీ భూమిహిన్ కిసాన్ న్యాయ్ యోజన కింద అందుతున్న రూ.7 వేలు సరిపోవడం లేదని చెప్పారని, అందుకే ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతామని రాహుల్గాంధీ చెప్పారు. పేదలు, కార్మికులు, రైతులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దళితుల కోసం కాంగ్రెస్ పనిచేస్తుండగా, కేంద్రం అదానీ వంటి బిలియనీర్ల కోసమే పనిచేస్తోందని రాహుల్ విమర్శించారు.
చత్తీస్గఢ్ ప్రభుత్వ రైతు అనుకూల మోడల్ దేశమంతటా ప్రతిబింబిస్తుందని రాహుల్గాంధీ అన్నారు. అంతకుముందు ఆయన సీఎం భూపేశ్ బాఘెల్, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవూతో కలిసి రాయ్పూర్సమీపంలోని కతియా గ్రామాన్ని సందర్శించారు. రైతులు, కూలీలతో మాట్లాడారు. కోతకు వచ్చిన వరి పంటకు కొబ్బరికాయ కొట్టారు. పర్యటన తర్వాత వరి పొలం వద్ద రైతులతో మాట్లాడిన ఫొటోలను ‘ఎక్స్’ (ట్విట్టర్) లో పోస్టూ చేస్తూ.. “రైతులు సంతోషంగా ఉంటే.. భారతదేశం సంతోషంగా ఉంటుంది. చత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఐదు ఉత్తమ చర్యలు తీసుకున్నది. ధాన్యం మద్దతు ధర రూ.2,640 (క్వింటా), 26 లక్షల మంది రైతులకు రూ.23,000 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, 19 లక్షల మంది రైతులకు రూ. 10,000 కోట్ల రుణమాఫీ, విద్యుత్ బిల్లు సగం, 5 లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.7,000 ఇస్తున్నది. రైతు అనుకూల ఈ విధానం భారతదేశం అంతటా ఓ మోడల్లో ప్రతిబింబిస్తుంది”అని రాశారు.
“పేదలకు ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల స్థానంలో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించబోతున్నం”అని ఆ రాష్ట్ర సీఎం భూపేశ్ బాఘెల్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.