దేశాన్ని కులం, మతం పేరుతో బీజేపీ విభజిస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భాష, మతం పేరుతో ప్రజలు వాళ్లలో వాళ్లే కొట్టుకునేలా ప్రేరేపిస్తున్నదని ఫైరయ్యారు. రాహుల్ గాంధీ ఈ నెల 14న మణిపూర్లో ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం అస్సాం నుంచి అరుణాచల్ప్రదేశ్లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ప్రత్యేక తలపాగా ధరించిన రాహుల్ గాంధీ వందలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి దోయిముఖ్ వైపు కదిలారు.
ఇటానగర్: బీజేపీ దేశాన్ని కులం, మతం పేరుతో విభజిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్గాంధీ అన్నారు. భాష, మతం పేరుతో ప్రజలు వాళ్లలో వాళ్లే కొట్టుకునేలా ప్రేరేపిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ జనవరి14న మణిపూర్లో ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించింది.
పాపమ్ పారే జిల్లాలోని గుమ్టో చెక్ గేట్ వద్ద అరుణాచల్లోకి యాత్ర ఎంటరవుతున్న సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నబమ్టుకీ రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక తలపాగా ధరించిన రాహుల్గాంధీ వందలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి దోయిముఖ్ వైపు కదిలారు. అక్కడ బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు.
“కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా.. బీజేపీ కొంతమంది వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. కాంగ్రెస్ మాత్రం ప్రజలను ఐక్యం చేయడానికి, వారి అభ్యున్నతి కోసం పనిచేస్తోంది. మేము అరుణాచల్ ప్రదేశ్కు రాష్ట్ర హోదా ఇచ్చాం. పేదల సమస్యలను లేవనెత్తడానికి, సమాజంలోని యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయడానికి మా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. దేశంలో విపరీతమైన నిరుద్యోగితకు బీజేపీయే కారణం. ప్రజల బాధలు వినేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మీడియా వారి సమస్యలను లేవనెత్తలేదు” అని రాహుల్గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు రాహుల్ యాత్ర ఆదివారం ఉదయం ఇటానగర్ నుంచి హోలోంగి మీదుగా సాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.