నిజామాబాద్ జిల్లాలో షుగర్​ ఫ్యాక్టరీలు తెరిపిస్తం : రాహుల్​ గాంధీ

నిజామాబాద్ జిల్లాలో షుగర్​ ఫ్యాక్టరీలు తెరిపిస్తం : రాహుల్​ గాంధీ
  • రూ.12 వేల నుంచి రూ.15 వేల మధ్య పసుపు రేటు చెల్లిస్తం
  • పసుపు బోర్డు వాగ్దానం వట్టి బూటకం
  • కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ 

నిజామాబాద్, ఆర్మూర్, వెలుగు : కాంగ్రెస్​ అధికారంలో వచ్చాక జిల్లాలో మూతబడిన షుగర్​ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మోర్తాడ్​ కార్నర్ ​మీటింగ్​లో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ప్రధాని మోదీ చేసిన పసుపు బోర్డు ప్రకటన మోసపూరిత వాగ్దానమని, ప్రజలు నమ్మొద్దని సూచించారు. తమ సర్కార్​వచ్చాక పసుపు రేటు క్వింటాల్​కు రూ.12 వేల నుంచి రూ.15 వేలు చెల్లిస్తామన్నారు. 

తడికెల టీస్టాల్​లో చాయ్​తాగి..

పెర్కిట్​మీదుగా ఆర్మూర్ వస్తున్న క్రమంలో అంక్సాపూర్​– పడిగెల మధ్య రోడ్డు పక్కన ఉన్న ఓ తడికెలలో నడుపుతున్న టీస్టాల్​వద్ద రాహుల్ ​ఆగారు. లోపలికి వెళ్లి టీస్టాల్​ నడుపుతున్న వారిని పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారు ఇచ్చిన చాయ్​ తాగుతూ ముచ్చటించారు. అక్కడున్న చిన్నపెద్దలకు షేక్​హ్యాండ్​ ఇచ్చి ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నారు. నెలకు ఎంత కరెంట్ ​బిల్లు కడుతున్నారని టీస్టాల్​నిర్వాహకులను  ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్​ఇస్తామని చెప్పారు. రాహుల్ ​వెంట వందల సంఖ్యలో కార్ల కాన్వాయ్​ కొనసాగింది. 

కాంగ్రెస్​ కార్యకర్తలు సింహాలు..

​కాంగ్రెస్ ​కార్యకర్తలను సింహాలుగా రాహుల్​అభివర్ణించారు. అడవిలో సింహాలు విడివిడిగా ఉంటాయని, కానీ కార్యకర్తలు వేల సంఖ్యలో సింహాలుగా గర్జిస్తున్నారన్నారు. బీఆర్ఎస్​ను గద్దె దిగడం పక్కా అంటూ వారిలో కార్యకర్తల్లో జోష్​నింపారు. పార్టీలోని యూత్, కిసాన్, సేవాదళ్​ మహిళా అనుబంధ విభాగాలను రాహుల్​తన ప్రసంగంలో ప్రస్తావించారు. మీటింగ్ ​ప్రాంగణంలో కార్యకర్తలు కాంగ్రెస్​ జెండాలు, నినాదాలతో హోరెత్తించారు. 

కమ్మర్​పల్లిలో ప్రవేశం..

జగిత్యాల జిల్లా కోరుట్ల మీదుగా రాహుల్​మధ్యాహ్నం 2 గంటలకు కమ్మర్​పల్లి శివారులోకి ఎంట్రీ అయ్యారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి మోర్తాడ్ ​వెళ్లి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుపై కార్నర్​ మీటింగ్​లో ప్రసంగించారు. రాహుల్ ప్రసంగాన్ని ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలుగులో అనువదించారు. మోర్తాడ్, పెర్కిట్​నుంచి ఆర్మూర్​ చేరుకున్న రాహుల్,​అక్కడ మీటింగ్​ ముగించుకొని  రోడ్డు మార్గంలో సాయంత్రం 5 గంటలకు శంషాబాద్​ఎయిర్​పోర్టుకు యాణమయ్యారు. 

అభ్యర్థులను గెలిపించాలని పిలుపు.. 

జిల్లాలో పర్యటించిన రాహుల్​గాంధీ మోర్తాడ్​కార్నర్​ మీటింగ్ ​ముగిశాక బాల్కొండ కాంగ్రెస్​అభ్యర్థి ముత్యాల సునీల్​రెడ్డిని ప్రజలకు పరిచయం చేసి, గెలిపించాలని కోరారు. ఆర్మూర్​లో పొద్దుటూరి వినయ్​రెడ్డితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. చివరలో బోధన్​ క్యాండిడేట్ ​సుదర్శన్​రెడ్డిని సభికులకు పరిచయం చేశారు. రాహుల్ ప్రసంగించడానికి  ఏర్పాటు  చేసిన బస్సు పైకి  పరిమిత సంఖ్యలో మాత్రమే లీడర్లను సెక్యూరిటీ ఆఫీసర్లు అనుమతించారు.