- అగ్నివీర్ స్కీమ్తో కార్పొరేట్ సంస్థలకే మేలని కామెంట్
పాట్నా: వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల 'ఇండియా' కూటమి అధికారంలోకి వస్తే ఎంఎస్పీ(మినిమమ్ సపోర్ట్ ప్రైస్)కు చట్టబద్ధత కల్పిస్తమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశ రైతుల న్యాయపరమైన డిమాండ్లను తమ పార్టీ పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా.. శుక్రవారం రాహుల్ గాంధీ బిహార్లోని రోహతాస్ జిల్లాలో పర్యటించారు.
టేకారి ఏరియాలోని రైతులతో ఏర్పాటు చేసిన కిసాన్ న్యాయ్ పంచాయితీలో ఆయన మాట్లాడారు. "రైతు పండించిన పంటలకు సరైన ధర లభించడం లేదు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎంఎస్పీకి చట్టపరమైన భరోసా కల్పిస్తం. రుణమాఫీ అయినా, ఎంఎస్పీ అయినా, రైతుల ప్రయోజనాలను కాంగ్రెస్ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఎంఎస్పీకి చట్టబద్ధతను కల్పించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాహుల్ ఈ కామెంట్లు చేశారు.
డిఫెన్స్ కాంట్రాక్టులన్నీ అదానీ గ్రూప్కే..
డిఫెన్స్ కాంట్రాక్టులన్నీ అదానీ గ్రూప్కు మాత్రమే వెళ్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. అగ్నివీర్ స్కీమ్తో కార్పొరేట్ సంస్థలకే మేలు జరగుతున్నదని చెప్పారు. డిఫెన్స్ బడ్జెట్ ద్వారా సొమ్ములో ఎక్కువ భాగం గౌతమ్ అదానీ జేబులోకి చేరనుందన్నారు. సైన్యం కోసం తెచ్చే హెలికాప్టర్లు, ఎయిర్క్రాఫ్ట్లు, ఫిరంగులు, కాట్రిడ్జ్లు, రైఫిల్స్ వంటి ఆధునిక ఆయుధాలన్నీ అదానీ గ్రూప్ యాజమాన్యంలోని కంపెనీ నుంచి కొనుగోలు చేస్తారని చెప్పారు.
ఆర్మీలో కేంద్రం రెండు వర్గాలను సృష్టించిందని రాహుల్ తెలిపారు. ఒకరు సాధారణ జవాన్ అయితే, మరొకరు అగ్నివీర్ అని వెల్లడించారు. అగ్నివీర్ గాయపడినా లేదా అమరవీరుడైనా అతనికి దేశ గౌరవం దక్కదని.. పరిహారం కూడా లభించదన్నారు. ఇలా సైన్యంలో రెండు వర్గాలను ఎందుకు సృష్టించారని కేంద్రాన్ని రాహుల్ నిలదీశారు. కాగా..శుక్రవారం యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉంది. అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చేరడంతో ప్రియాంక రాలేదు. కోలుకున్న వెంటనే తాను యాత్రలో జాయిన్ అవుతానని ట్వీట్ చేశారు.