
అహ్మదాబాద్: గుజరాత్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రూ. 1000 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ రూ. 500కే అందిస్తామని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సోమవారం అహ్మదాబాద్ లో సబర్మతి నది వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన పరివర్తన్ సంకల్ప్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 3 లక్షల రుణమాఫీ, ఫ్రీ కరెంట్ కూడా ఇస్తామని ప్రకటించారు. సాధారణ వినియోగదారులకు కూడా 300 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు. 10 లక్షల కొత్త ఉద్యోగాలు, 3 వేల ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల ఏర్పాటు వంటి హామీలను ఇచ్చారు. కాగా, అహ్మదాబాద్ టూర్ సందర్భంగా సబర్మతి ఆశ్రమాన్ని కూడా రాహుల్ సందర్శించి, మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.