రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రెండో రోజు వాయనాడ్ నియోజకవర్గంలో రోడ్ షో చేసిన ఆయన... కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ ధనవంతుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల మోదీ పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు రాహుల్. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని కాపాడుతుందని చెప్పారు.
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాహుల్ గాంధీ. ఎలక్టోరల్ బాండ్లను దోపిడీగా అభివర్ణించారు రాహుల్. ప్రతి చిన్న పట్టణంలో లేదా గ్రామంలో కొంత మంది వ్యక్తులు భౌతికంగా దాడి చేసి బెదిరించి వీధుల్లో డబ్బు వసూలు చేస్తారు. మోదీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చేసేది అదేనన్నారు. ఒక సాధారణ దొంగ వీధుల్లో ఏమి చేస్తున్నాడో.. ప్రధానమంత్రి అంతర్జాతీయ స్థాయిలో అదే చేస్తున్నారని ఆరోపించారు.
వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ అధునాతన వ్యూహాలను ఉపయోగిస్తోందంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని కొంతమంది ధనిక వ్యాపారులకు మోదీ సాయం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. దేశంలోని 20 -నుంచి25 మంది వ్యాపారవేత్తలకు మోదీ దాదాపు రూ.16 లక్షల కోట్లు ఇచ్చారని ఆరోపించారు. దేశానికి ఒలింపిక్స్ను తీసుకురావడం, చంద్రునిపైకి మనిషిని పంపడం మాత్రమే బీజేపీ మానిఫెస్టో అని.. కాంగ్రెస్ మేనిఫెస్టో భారత ప్రజల గొంతుక అని రాహుల్ గాంధీ తెలిపారు.