మాల్డా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బుధవారం పశ్చిమబెంగాల్లోని మాల్డా జిల్లాలో నిర్వహించిన యాత్రలో రాహుల్ కారు అద్దం ధ్వంసం అయింది. రాహుల్ కారు ముందుకు ఓ మహిళ సడెన్గా వచ్చిందని, దీంతో వెంటనే బ్రేక్ వేయడంతో చుట్టూ ఉన్న కార్యకర్తలు కారుపై పడ్డారు.
దీంతో కారు వెనుక అద్దం ధ్వంసం అయిందని ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఘటన జరిగిన సమయంలో రాహుల్ కారులో లేడని తెలిపింది. పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధురి మాట్లాడుతూ.. మాల్డాలో రాహుల్ కారుపై కొంతమంది దుండగులు రాళ్లు విసిరారని ఆరోపించారు. సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. బిహార్లోని కతిహార్లో రాహుల్ కారుపై రాళ్ల దాడి జరిగిందని తెలిపారు. ఈ దాడి తమ రాష్ట్రంలోనే జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.