కర్ణాటకలో తొలి జికా వైరస్ కేసు నమోదు

కర్ణాటకలో తొలి జికా వైరస్ కేసు నమోదు

కర్ణాటకలో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.కె.సుధాకర్ వెల్లడించారు. రాయచూరు జిల్లా మాన్విలోని కోళి క్యాంపు గ్రామానికి చెందిన 5ఏళ్ల చిన్నారికి ఈ వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు. ఆ బాలిక రక్త నమూనాలను డెంగీ, చికెన్ గన్యా వైరస్‌ నిర్ధారణల తర్వాత జికా వైరస్‌ పరీక్షల కోసం పుణెకు పంపగా పాజిటివ్‌గా తేలిందన్నారు. లక్షణాలున్న ముగ్గురి నమూనాలను పూణెకు పంపామని, అందులో ఇద్దరికి నెగెటివ్ రాగా, ఒకరికి వైరస్ సోకినట్టు గుర్తించామని స్పష్టం చేశారు.

తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతున్న ఈ చిన్నారిని రాయచూరులోని సింధనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తదుపరి చికిత్స కోసం బళ్లారిలోని విజయనగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. ఇంకా కేసులు నమోదైనా భయపడాల్సిన అవసరం లేదని, ఈ విషయంపై ప్రభుత్వం సమీక్షిస్తోందని మంత్రి తెలిపారు. జికా వైరస్‌ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను విడుదల చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. జికా వైరస్‌ కేసు దేశంలో మొదటగా కేరళలో నమోదు కాగా.. తర్వాత మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదయ్యాయి.