జనగామ, వెలుగు : రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ కష్టాలకు తెర దించేలా ఆ డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తోంది. జనగామ జిల్లా పెంబర్తి రైల్వే స్వేషన్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రెడీ అవుతోంది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో గేటు వద్ద ట్రాఫిక్ జామ్ కు చెక్ పడనుంది. సికింద్రాబాద్-కాజీపేట రైల్వే మార్గంలోని జనగామ జిల్లాలో ఏడు రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
ఇందులో హస్త కళలకు పేరొందిన పెంబర్తిలో రైల్వే స్టేషన్ ఇ గ్రేడ్లో ఉంది. ఈ స్టేషన్ మీదుగా జనగామ జిల్లాలోనే ఎల్లంల, సిద్దెంకి, పోచన్నపేట మీదుగా సిద్దిపేట వైపునకు వెళ్లే రోడ్డు మార్గం ఉంది. సికింద్రాబాద్ టూ కాజీపేట మార్గంలో రైలు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో పెంబర్తి వద్ద గేటు ఎక్కువగా వేసే ఉంటుంది. స్టేషన్కు ఒకవైపు క్రషర్లు ఉండడంతో గేటు వేసిన సమయాల్లో ట్రాఫిక్ నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జాయింట్ ఇన్స్పెక్షన్
ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించడానికి అమలు చేస్తున్న ప్రణాళికలో భాగంగా పెంబర్తి (ఎల్సీ 40) గేటు వద్ద ఓవర్ బ్రిడ్జిగానీ, అండర్ బ్రిడ్జిగానీ నిర్మించాలని రైల్వే డిపార్ట్మెంట్ గతంలో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రెవెన్యూ, ఇంజినీరింగ్, రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్లు గతవారం జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. నిర్మాణ సమయంలో ట్రాఫిక్ ఆగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించారు. కాగా, ఆర్వోబీ నిర్మాణానికి బడ్జెట్ ఎక్కువగా అవుతుందని గుర్తించి ఆఫీసర్లు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికే నిర్ణయించారు.
ఆర్యూబీ కోసం రైల్వే డిపార్ట్మెంట్ రెండు డీపీఆర్లు రూపొందిస్తోందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇందులో అనుకూలమైన డీపీఆర్ను ఆమోదించనున్నారు. ఇదిలా ఉండగా, ఆర్యూబీ నిర్మాణంతో లారీలు, బస్సులు వంటి పెద్ద వెహికల్స్ రాకపోకలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. రైల్వే ట్రాక్కు ఒకవైపు క్రషర్ ఉంది. పలు గ్రామాల మీదుగా సిద్దిపేట వైపు వెళ్లడానికి రోడ్డు మార్గం ఉండడంతో పెద్ద వాహనాలు ఇబ్బందిగా మారనుంది. స్టేషన్ పరిసరాల్లో ఉన్న రోడ్డు పరిశీలిస్తే ఆయా గ్రామాలకు చిన్న వెహికల్స్ వెళ్లే అవకాశం మాత్రమే ఉంటుంది
