
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ బులిటెన్ ప్రకారం.. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ 21వ తేదీ ఉదయం 8.30 లోపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక.. హైదరాబాద్ నగరంలో వర్షం సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. టోలీచౌకిలోని రుమాన్ హోటల్ వరద నీళ్లలో మునిగిపోయింది. పార్సిగుట్ట పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పార్సిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర, వినోభానగర్ కాలనీలు మోకాళ్ల లోతు నీటిలో ఉన్నాయి. 24 గంటలుగా ఇదే పరిస్థితి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి సమయంలో పడిన వర్షానికి పార్సిగుట్టలోని అన్ని కాలనీల్లో ఇళ్లల్లోకి నీళ్లు రావటం.. వీధుల్లోనూ మోకాళ్ల లోతు నీళ్లు ఉండటంతో కాలనీవాసులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకధాటిగా వాన దంచికొట్టింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. స్థానిక కంఠేశ్వర్ రైల్వే కమాన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కింద వాననీళ్లలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. మధ్యాహ్నం వరంగల్ నుంచి వస్తున్న బస్సు రైల్వే అండర్ బ్రిడ్జి కింద ఐదడుగులకు పైగా చేరిన నీటిలో మునిగింది. బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులను పోలీసులు, స్థానిక యువకులు బస్సులో నుంచి దింపి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నీళ్లలో చిక్కుకున్న బస్సును జేసీబీ సాయంతో బయటకు తీసి డిపోకు తరలించారు. నిజామాబాద్ నగరంలో దంచికొట్టిన వాన లోతట్టు ఏరియాలపై తీవ్ర ప్రభావం చూపింది.