
బుధవారం ( సెప్టెంబర్ 17 ) హైదరాబాద్ లో కురిసిన కుండపోత వర్షం మరువక ముందే.. గురువారం ( సెప్టెంబర్ 18 ) సాయంత్రం మళ్ళీ మొదలైంది. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఒక పక్క ఎండగా ఉన్నప్పటికీ వర్షం కురుస్తూ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ వర్షం క్రమంగా సిటీ మొత్తం వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం మొదలైన వర్షం రాత్రికి సిటీ మొత్తానికి వ్యాపిస్తే ఈ రాత్రి కూడా కుండపోత తప్పదా అన్న జనాల్లో ఆందోళన మొదలైంది.
ఎల్బీ నగర్, వనస్థలిపురం,నాగోల్ పరిసర ప్రాంతాల్లో మొదలైన వర్షం రాత్రికి క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు త్వరగా వెళ్లడం బెటర్ అని సూచిస్తున్నారు వాతావరణ నిపుణులు. ఇదిలా ఉండగా.. బుధవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ లో జనజీవనం స్తంభించింది.
ALSO READ : హైదరాబాద్లో ఏంటీ కుంభవృష్టి..?
సాయంత్రం 4 గంటల నుంచి శివారుల్లో వర్షం కురవగా, కోర్ సిటీలో 6.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నాన్స్టాప్ వాన కురిసింది. ముషీరాబాద్లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికమని అధికారులు చెప్తున్నారు. మెయిన్రోడ్లు మొదలుకుని ఇంటర్నల్రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపించాయి. ఫలితంగా గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో జనం ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల విద్యుత్సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి మాసబ్ట్యాంక్, చింతల్బస్తీ, లోయర్ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో సహాయక చర్యలు పరిశీలించారు.