రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9వ ప్యాకేజీ పనులు స్పీడప్​

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9వ ప్యాకేజీ పనులు స్పీడప్​
  • ఎత్తిపోతల ద్వారా ఎగువ మానేరు, మల్కపేట రిజర్వాయర్లు నింపే ప్లాన్‌‌‌‌‌‌‌‌ 
  • వీటి ద్వారా రాజన్న జిల్లాలో 86వేల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు 
  • ఇప్పటికే మల్కపేట కుడికాలువ పూర్తి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎగువ మానేరులకు ఎత్తిపోతల ద్వారా నింపి సాగునీరందించే పనులు స్పీడందుకున్నాయి. కాళేశ్వరంలో భాగంగా 9వ ప్యాకేజీ కింద ఈ రిజర్వాయర్లను నింపేందుకు గత ప్రభుత్వం పనులను ప్రారంభించింది. నిధుల కేటాయింపులో జాప్యంతో ఈ పనులు నత్తనడకన సాగగా.. తాజాగా విప్‌‌‌‌‌‌‌‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ చొరవతో మల్కపేట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు పూర్తవుతున్నాయి. ఇప్పటికే మల్కపేట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుడి కాలువ పూర్తి కాగా ఈనెల 4న విప్​ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ నీటిని విడుదల చేశారు. 

సింగసముద్రం వద్ద పనులు పెండింగ్

మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని భూములను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరంలో భాగంగా 9వ ప్యాకేజీ పనులు ప్రారంభించారు. మల్కపేట రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి నర్మాల ఎగువ మానేరుకు కాలువ ద్వారా నీటిని ఎత్తిపోయనున్నారు. ఎగువ మానేరును నింపే 9వ ప్యాకేజీ పనులు పూర్తయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 86వేల ఎకరాలకు సాగునీరందనుంది. ప్రభుత్వం 9వ ప్యాకేజీ పనులను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. మల్కపేట నుంచి ఎగువమానేరు నింపే పనులు కొలిక్కి వచ్చినా గంభీరావుపేట మండలం సింగసముద్రం చెరువు వద్ద కెనాల్ వద్ద పంప్​హౌజ్ పనులు ఆగాయి. గత ప్రభుత్వంలో నిధులు విడుదల కాకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేస్తే పనులు పూర్తవుతాయని ఆఫీసర్లు చెప్తున్నారు. 

వేములవాడకు కుడి కాలువ ద్వారా నీరు

మల్కపేట రిజర్వాయర్ నుంచి కుడి కాలువ పనులు పూర్తయ్యాయి. ఈ కాలువ దాదాపు 12  కిలోమీటర్ల మేర ఉండగా.. ఈ నెల 4న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీటిని విడుదల చేశారు. ఈ కాలువ ద్వారా మల్కపేట ఊర చెరువు, పల్లిమక్త, నాగారం, సుద్దాల, రామన్నపేట చెరువులను నింపుతున్నారు. వీటి కింద సుమారు 25వేల ఎకరాలు సాగులోకి రానుంది. ఇప్పటికే కుడికాలువ ద్వారా ఈ గ్రామాల మీదుగా కాలువ నీరు పారుతోంది. 

బ్రిడ్జి పనులు కొనసాగుతున్న ప్రాంతంలో పైప్ లైన్ వేసి ఆఫీసర్లు నీటిని పంపిస్తున్నారు. ఈ యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లోని పంటలు ఎండే పరిస్థితి రాగా.. మల్కపేట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి గ్రావిటీ కెనాల్‌‌‌‌‌‌‌‌ ద్వారా సాగునీరిందించారు. దాదాపు  8వేల ఎకరాలు పొట్ట దశకు వచ్చిన పంటలను ఈ నీటి ద్వారా కాపాడారు.