
అదానీ షేర్లపై రెట్టింపు సంపాదిస్తాం
బ్లూమ్బర్గ్ ఇంటర్వ్యూలో జీక్యూజీ రాజీవ్ జైన్
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ షేర్లలో పెట్టిన 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబోయే కొన్నేళ్లలో రెట్టింపవుతాయని జీక్యూజీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ రాజీవ్ జైన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ ప్రకటించిన రిపోర్టుతో అదానీ గ్రూప్ ఆర్థికంగా చిక్కుల్లో పడిన టైములో జీక్యూజీ ఈ పెట్టుబడులు పెట్టడం విశేషం. రాబోయే అయిదేళ్లలో అదానీ గ్రూప్ షేర్లు మల్టీ బాగర్స్ అవుతాయని జైన్ బ్లూమ్బర్గ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు. పెట్టుబడి కనీసం డబులైతే అలాంటి పెట్టుబడులను మల్టీ బాగర్స్గా వ్యవహరిస్తారు.
హిండెన్బర్గ్ రిపోర్టు చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ సంపద 153 బిలియన్ డాలర్ల దాకా ఆవిరయిపోయింది. అదానీ గ్రూప్ షేర్ల ధరల మానిప్యులేషన్తోపాటు, మోసాలకూ పాల్పడుతోందని హిండెన్బర్గ్ రిపోర్టు ఆరోపించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తిరస్కరించింది. అలాగే, జైన్ పెట్టుబడుల నిర్ణయంపైనా ఆ రిపోర్టు ఎఫెక్ట్ చూపించలేకపోయింది. అదానీ గ్రూప్ వాల్యూ కంపెనీ ఎసెట్లలో ఉందని జైన్ చెప్పారు. దేశంలోని వివిధ రంగాలలో అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యమని గుర్తించిన ప్రభుత్వం, ఆ దిశలో తీసుకుంటున్న చొరవలో భాగం అయ్యేందుకు ముందు నుంచీ అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోంది.
అదానీ గ్రూప్ చేతిలోని బొగ్గు గనులు, డేటా సెంటర్లు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మెజారిటీ వాటా వంటివన్నీ హెల్తీ బిజినెస్లేనని రాజీవ్ జైన్ పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ విలువే కంపెనీ విలువ కంటే ఎక్కువ ఉంటుందని జైన్ వెల్లడించారు. ఆసియాలోనే అత్యంత ఖరీదైన అర్బన్ రియల్ ఎస్టేట్ ఈ ఎయిర్పోర్టు కింద ఉందని పేర్కొన్నారు.