
న్యూఢిల్లీ: పాక్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా గురువారం (మే 8) పాక్ మెరుపు దాడులకు దిగింది. సరిహద్దు రాష్ట్రాల్లో మిసైళ్లు, డ్రోన్ల దాడులు చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలపై దాడులకు యత్నించింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ టార్గెట్గా దాడులు చేసింది. పాక్ దాడులతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది.
సరిహద్దు జిల్లాలో పూర్తిగా బ్లాక్ ఔట్ ప్రకటించింది. పాక్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో భారత త్రివిధ దళాధిపతులు, సీడీఎస్తో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యసరంగా సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. మరోవైపు పాక్ సైనిక చర్యలను ప్రధాని మోడీ నిశితంగా పరిశీలిస్తున్నారు. పాక్ దాడులపై ఎప్పటికప్పుడు ఆయన ఆరా తీస్తున్నారు.
ALSO READ | యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీల మూసివేత
పాక్ దాడుల నేపథ్యంలో జమ్ము కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎవరూ జిల్లా ధాటి వెళ్లొద్దని ఆదేశించారు. పాక్ సరిహద్దు జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
అలాగే.. అన్ని విభాగాల ప్రభుత్వ అధికారుల సెలవులు రద్దు చేశారు. అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎవరూ బయటకు వెళ్లొద్దని.. ఇళ్లలోనే అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సరిహద్దు జిల్లాల్లోని ఇళ్లలో లైట్లు ఆపి.. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు.
మరోవైపు పాక్ దాడులను ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని తెలిపింది. పఠాన్ కోట్ఎయిర్ బేస్కు ఎలాంటి నష్టం జరగలేదని క్లారిటీ ఇచ్చింది. జమ్మూపై పాక్ చేసిన భీకర దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొంది. జమ్ముకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది.