
- సంతకం చేసేందుకు నిరాకరణ
క్వింగ్డావో: చైనాలోని క్వింగ్డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్ సీ ఓ) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాయింట్ డాక్యుమెంట్పై సంతకం చేయడానికి నిరాకరించారు. అందులో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావించకపోవడం, పాకిస్తాన్లోని బలోచిస్తాన్లో చోటుచేసుకున్న అశాంతిని భారత్ కు ముడిపెడుతూ పరోక్ష ఆరోపణలు చేయడంతో ఆ డాక్యుమెంట్పై రాజ్నాథ్ సంతకం చేయడానికి నిరాకరించారు.
దీంతో ఎస్ సీఓ సమావేశం జాయింట్ డాక్యుమెంట్ను జారీ చేయకుండానే ముగిసింది. అంతేకాకుండా పాకిస్తాన్ ఒత్తిడి మేరకే చైనా ఆ డాక్యుమెంట్లో పహల్గాం దాడి ప్రస్తావనను తొలగించిందని, ప్రస్తుతం ఎస్ సీ ఓ అధ్యక్ష దేశంగా ఉన్న చైనా దీనికి సహకరించినట్టు భారత్ ఆరోపించింది. ఈ చర్యను చైనా, పాకిస్తాన్ రాజకీయ ఎత్తుగడగా భావించింది. సమావేశంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని పునరుద్ఘాటించారు.
"కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని రాష్ట్ర విధానంగా ఉపయోగిస్తున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయి. ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలకు స్థానం ఉండకూడదు. ఎస్ సీ ఓ సభ్య దేశాలు ఇటువంటి దేశాలను ఖండించడంలో వెనుకాడకూడదు" అని సూచించారు. ఎస్ సీఓలో భారత్, చైనాతో పాటు బెలారస్, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. గురువారం సమావేశం అనంతరం రష్యా, బెలారస్ రక్షణ మంత్రులు ఆండ్రీ బెలోసోవ్, విక్టర్ ఖ్రెనిన్తో రాజ్నాథ్ సింగ్ చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రతా, ద్వైపాక్షిక రక్షణ, వ్యూహాత్మక సంబంధాలపై చర్చించినట్టు మంత్రి వెల్లడించారు. పాక్ ఉగ్రవాదం, భారతదేశ సవాళ్లనూ మీటింగ్ లో హైలైట్ చేసినట్టు పేర్కొన్నారు.