రాజ్యసభకు వెళ్లేది ఎవరు? సీఎం కేసీఆర్ మొగ్గు ఎవరివైపు?

రాజ్యసభకు వెళ్లేది ఎవరు? సీఎం కేసీఆర్ మొగ్గు ఎవరివైపు?

నోటిఫికేషన్​ రావడంతో టీఆర్ఎస్​లో పెరిగిన వేడి

ఉన్న రెండు సీట్ల కోసం తీవ్రంగా పోటీ

కేకేకు మళ్లీ చాన్స్ వస్తదా.. కవితను ఎంపిక చేస్తరా?

రేసులో నాయిని, వినోద్, పొంగులేటి, మధుసూదనాచారి, సురేశ్ రెడ్డి

మందా, సీతారాం నాయక్ కూడా..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో ఖాళీకానున్న రెండు రాజ్యసభ సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదలవడంతో టీఆర్ఎస్​లో వేడి పెరిగింది. రాజ్యసభ చాన్స్​ దొరికే ఆ ఇద్దరు నేతలెవరనే దానిపై ఉత్కంఠ మొదలైంది. పార్టీలో సీనియర్​ నేతలు చాలా మంది రాజ్యసభ చాన్స్​ కోసం ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. రేసులో ఉన్న వారిలో ఎవరికైనా అవకాశమిస్తారా లేక, పార్లమెంట్​ ఎలక్షన్ల నాటి తరహాలో కొత్త ముఖాలు, రాజకీయాలతో సంబంధాలు లేని పారాచూట్​ నేతలు తెరపైకి వస్తారా అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీలో టీఆర్ఎస్ కు ఉన్న సంఖ్యాబలం మేరకు ఎన్నికలు జరిగే రెండు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ పత్రాలపై 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌కు ఆరుగురే ఎమ్మెల్యేలు ఉండటంతో నామినేషన్​ కూడా వేయలేదు. ఇక ఎన్నిక జరిగే రెండు సీట్లు కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందినవి కావు. ఒకటి కాంగ్రెస్, మరొకటి బీజేపీ సిట్టింగ్​ స్థానాలు కావడం గమనార్హం.

రేసులో పెద్ద లీడర్లు

రాజ్యసభ సీటు కోసం చాలా మంది టీఆర్ఎస్​ లీడర్లు ఆశలు పెట్టుకున్నారు. మాజీ స్పీకర్లు కేఆర్ సురేశ్​ రెడ్డి, మధుసూదనాచారి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వర్​రావు, నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, బస్వరాజు సారయ్య.. మాజీ ఎంపీలు కవిత, వినోద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మందా జగన్నాధం, సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్ రేసులో ఉన్నారు. ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న కేకే పదవీకాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు వరుసగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన మరో చాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఉన్నారని.. అందువల్ల కేకే కు మరో చాన్స్ ఉంటుందా, లేదా అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కవితకు చాన్స్ ఇస్తారా?

కేసీఆర్​ బిడ్డ, నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు రాజ్యసభ చాన్స్​ అంశంపైనా టీఆర్ఎస్​ నేతల్లో చర్చ జరుగుతోంది. ఆమె లోక్​సభ ఎలక్షన్ల ఓడిపోయినప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. ఈ మధ్య పసుపు బోర్డుపై పెద్ద ఎత్తున వివాదం తలెత్తినప్పుడు కూడా ఆమె ఎక్కడా కనిపించలేదు. కొంతకాలం పాటు నిజామాబాద్ పార్లమెంట్ కు దూరంగా ఉండాలని కేసీఆర్ సూచన మేరకే ఆమె అలా వ్యవహరిస్తున్నారని ఓ మంత్రి పేర్కొన్నారు. మరోవైపు కవితకు రాజ్యసభ సీటు ఇవ్వాలా వద్దా అన్న దానిపై సీఎం కేసీఆర్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఓ సీనియర్ నేత చెప్పారు. ‘‘గత ప్రభుత్వంలో కవితకు సొంత కేడర్, నెట్ వర్క్ ఉండేది. టీఆర్ఎస్ కేడర్ తో సంబంధం లేకుండా ఆమె సొంతంగా ప్రోగ్రాంలు పెట్టుకునేవారు. ఆమె ఓడినప్పటి నుంచీ అవన్నీ కనుమరుగయ్యాయి. కవితకు రాజ్యసభ చాన్స్​ ఇస్తే మళ్లీ మరో పవర్ సెంటర్ తయారవుతుంది. ఇది కేసీఆర్​కు ఇష్టం లేదు’’అని ఆ లీడర్​ చెప్పారు. ఇక కేసీఆర్​ బంధువు, మాజీ ఎంపీ వినోద్ కూడా రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి చెందిన సంతోష్ కుమార్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రెండో సీటును వెలమ కులానికి, బంధువుకు ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.

కులాల లెక్కలు చూసి ఇస్తరా?

టీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు బీసీలు డీఎస్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, ఓసీ వర్గానికి చెందిన సంతోష్ కుమార్, కెప్టెన్​ లక్ష్మీకాంతరావు ఉన్నారు. ఈ నేపథ్యంలో కులాల లెక్కల మేరకు ఎస్సీలకు ఒక సీటు ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మందా జగన్నాథం, గుడిమల్ల రవికుమార్ ల పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్​ ఎస్టీలకు ఇంతవరకు రాజ్యసభ సీటు ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. అందువల్ల ఈసారి తమకు చాన్స్​ ఇవ్వొచ్చని ఎస్టీ వర్గానికి చెందిన మాజీ ఎంపీ సీతారాం నాయక్, రిటైర్ట్ ఐఏఎస్ రామచంద్ర నాయక్ ఆశలు పెట్టుకున్నారు.

సార్ మాటిచ్చారంటున్న కొందరు లీడర్లు!

రాజ్యసభ సీటుపై సీఎం కేసీఆర్ తమకు మాటిచ్చారని కేకేతోపాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఖమ్మం జిల్లా నేతలు తనకు మోకాలడ్డుతున్నారన్న ఉద్దేశంతో పొంగులేటి.. ఏపీ సీఎం జగన్ ద్వారా కేసీఆర్ కు చెప్పించారని ప్రచారంలో ఉంది. మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి పార్టీలో చేరేటప్పుడే రాజ్యసభ పదవి ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక నాయిని నర్సింహారెడ్డి ఎమ్మెల్సీ పదవీకాలం ఆగస్టులో ముగుస్తోంది. తనను కేబినెట్లోకి తీసుకోకపోతే రాజ్యసభకు పంపుతామన్న హామీ ఉందని ఆయన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. మాజీ స్పీకర్ మధుసుదనాచారి కూడా తనకు రాజ్యసభ హామీ ఉన్నట్టుగా పేర్కొంటున్నారు.

రాజ్యసభ ఎలక్షన్ల షెడ్యూల్​ రిలీజ్​

దేశవ్యాప్తంగా 55  రాజ్యసభ ఎంపీ స్థానాలకు మార్చి 26న  ఎలక్షన్లు జరుగుతాయని కేంద్ర ఎలక్షన్​ కమిషన్ ప్రకటించింది. ఈమేరకు ఈసీ​ మంగళవారం  ఎన్నికల  షెడ్యూల్​ను రిలీజ్​ చేసింది.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​తోపాటు మరో15 రాష్ట్రాల్లో  ఏర్పడనున్న ఖాళీలకు ఎలక్షన్లు జరుగుతాయని ఈసీ వర్గాలు తెలిపాయి. ఎంపీల రిటైర్​మెంట్​ కారణంగా 55 సీట్లలో 51 సీట్లకు ఏప్రిల్​లో ఖాళీలు ఏర్పడతాయి.  నాలుగు సీట్లు మాత్రం ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి.   రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​ హరివంశ (జేడీయూ), కేంద్రమంత్రి రామ్​దాస్​ అథవాలె (ఆర్పీఐ‌‌‌‌, అథవాలె), మోతీలాల్​ఓరా, కుమారి సెల్జా, దిగ్విజయ్​సింగ్​(కాంగ్రెస్​), కేంద్రమంత్రి విజయ్​ గోయెల్​ (బీజేపీ)లు ఏప్రిల్​లో రిటైర్​ కానున్నారు. గుజరాత్​, బీహార్​, మేఘాలయ, మణిపూర్​లో ఎన్డీయే తన బలాన్ని పెంచుకునే అవకాశముంది. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​ ఎక్కువ సీట్లు గెలుచునే అవకాశాలున్నాయి.  తృణమూల్​, వైఎస్ఆర్సీపీ  కూడా  ఎక్కువ సీట్లు గెలుచుకునే చాన్స్​ ఉంది.

మార్చి 3 :  రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్

    మార్చి 13: నామినేషన్లు ఫైల్​చేయడానికి గడువు

    మార్చి 16: నామినేషన్ల పరిశీలన

    మార్చి18 :నామినేషన్ల విత్​డ్రాకు ఆఖరుతేదీ

    మార్చి 26 : ఎలక్షన్లు

ఏ రాష్ట్రం ‌‌- ఎన్ని సీట్లు ఖాళీ

తెలంగాణ–2,  ఆంధ్రప్రదేశ్​–4,
మహారాష్ట్ర–7,  తమిళనాడు–6, బెంగాల్​–5, బీహార్–5, ఒడిశా–4, గుజరాత్–4,
అస్సాం–3, మధ్యప్రదేశ్​–3,  రాజస్థాన్​–3, చత్తీస్​గఢ్– 2,  హర్యానా– 2, జార్ఖండ్​–2, హిమాచల్​–1,  మణిపూర్–1, మేఘాలయ–1.