చెర్రీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి

చెర్రీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి

జనవరిలో తారక్‌‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’తో ప్రేక్షకుల ముందుకొస్తున్న రామ్ చరణ్, ఆ వెంటనే ఫిబ్రవరిలో తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’తో పలకరించబోతున్నాడు. దాంతో ఓవైపు శంకర్ సినిమా షూటింగ్‌‌లో పాల్గొంటూనే మరోవైపు ఈ రెండు సినిమాల ప్రమోషన్‌‌ యాక్టివిటీస్‌‌లో బిజీ అవబోతున్నాడు. ‘ఆచార్య’కి చరణ్ నిర్మాత కూడా కావడంతో తన బాధ్యత మరింత పెరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కథకు ఎంతో కీలకమైన సిద్ధ అనే పాత్రను పోషిస్తున్నాడు చరణ్. తన క్యారెక్టర్‌‌‌‌కి సంబంధించిన టీజర్‌‌‌‌ని ఈనెల 28న విడుదల చేయబోతున్నారు.

టీజర్‌‌‌‌ రిలీజ్‌‌ డేట్‌‌ని అనౌన్స్‌‌ చేస్తూ ఆచార్య నుంచి నిన్న ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నక్సలైట్ గెటప్‌‌లో చేతిలో తుపాకీతో ఆవేశంగా అడుగులేస్తున్నాడు రామ్‌‌చరణ్. ‘ధర్మమే సిద్ధ’ అంటూ ఈ పోస్టర్‌‌‌‌ని ట్వీట్ చేశారు చిరంజీవి. అనేక కారణాల వల్ల ఇది తనకెంతో మెమొరబుల్ క్యారెక్టర్‌‌‌‌ అని, పవర్‌‌‌‌ఫుల్ టీజర్‌‌‌‌ రాబోతోందని చరణ్ ట్వీట్ చేశాడు. చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజాహెగ్డే నటిస్తున్నారు. ఫిబ్రవరి 4న సినిమా విడుదల కానుంది. ఇక ప్రస్తుతం శంకర్ తీస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు రామ్ చరణ్. హైదరాబాద్‌‌ ఆర్​ఎఫ్‌‌సిలో ఈ మూవీ సెకెండ్ షెడ్యూల్ షూట్ జరుగుతోంది. రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్‌‌లో రొమాంటిక్ సీన్స్ తీస్తున్నట్టు తెలుస్తోంది.