భారత దేశంలో హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. చాలా దేవాలయాలకు చారిత్రక నేపథ్యం ఉంది. కొన్ని దేవాలయాలకు స్థల మహత్యం ఉందని పెద్దలు చెబుతుంటారు. మరికొన్ని దేవాలయాలు గ్రామస్థులు.. విరాళాలు సేకరించి దేవాలయాన్ని నిర్మించుకున్నారు. అయితే ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లా చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేరళపెండ గ్రామంలో ఒక పురాతన.. ప్రాచీన రామాలయం ఉంది. ఈ దేవాలయాన్ని దాదాపు 21 ఏళ్ల క్రితం మూసేశారు. అప్పటి నుంచి దేవాలయంలో ఓపెన్ చేయలేదు. అయితే ఇప్పుడు సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు ఈ దేవాలయాన్ని ఓపెన్ చేశారు. వివరాల్లోకి వెళ్తే...
ఛత్తీస్ గఢ్ లోని కేరళ పెండ గ్రామం దట్టమైన అడవుల మధ్యలో ఉండేది. దాదాపు 50 ఏళ్ల క్రితం ఇక్కడ గ్రామస్తులు అందరు కలిసి రామాలయాన్ని నిర్మించుకున్నారు. ఇది అతి ప్రాచీనమైన రామ మందిరం. త్రేతా యుగంలో శ్రీరామ చంద్రుడు వనవాసం చేసే సమయంలో ఈ ప్రాంతంలోనే శ్రీరామ చంద్రుడు దాదాపు మూడు నెలలు నివాసమున్నాడని కొంతమంది ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
అయితే చత్తీస్ గఢ్ రాష్ట్రం నక్సలైట్ల ప్రాబల్యం గల రాష్ట్రం. సుమారు 21 సంవత్సరాల క్రితం కొంతమంది నక్సలైట్లు ఈ దేవాలయాన్ని ఆవాసంగా ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు సాగించేవారట. అప్పటి నుంచి నక్సలైట్ల భయంతో ఒక్క కుటుంబం తప్ప గ్రామస్తులు ఎవరు గుడికి వెళ్లలేదని తెలిసింది. కుటుంబ సభ్యులు రహస్యంగా గుడికి వెళ్లి దేవుడికి పూజలు చేసేవారు. ఆతరువాత కాల క్రమేణ ఆ దేవాలయం మూతపడింది.
ఇప్పుడు ఆలయ సమీపంలో లఖపాల్లో సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు కొత్త క్యాంపును ఏర్పాటు చేసుకున్నాయి. సీఆర్పీఎఫ్ జవాన్లు కేరళపెండా గ్రామానికి వెళ్లి గ్రామస్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారు గ్రామంలోని ఆలయ పరిస్థితి గురించి వివరించారు. అంతేకాదు.. తాము పూజలు చేసుకునేందుకు గుడిని తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని జవాన్లను గ్రామస్థులు కోరారు. గ్రామస్థుల అభ్యర్థన మేరకు CRPF 74వ బెటాలియన్ సైనికులు రామాలయం తలుపులు తెరిచి శుభ్రం చేశారు . గుడిలో రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలకు పూజలు చేశారు.ఈ ఆలయం దాదాపు 5 దశాబ్దాల నాటిది. రాముడు, సీత , లక్ష్మణుల పాలరాతి విగ్రహాలను దర్శించుకున్న భక్తులు ఆనందంతో నృత్యం చేశారు. ఆలయాభివృద్ధి చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.