రాజన్న సిరిసిల్ల కు చెందిన కార్వింగ్ కళాకారుడి ప్రతిభ
రాజన్న సిరిసిల్ల, వెలుగు: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ క్యారెట్లు, గుమ్మడికాయలతో రామ మందిరాన్ని తయారు చేసి తన ప్రతిభ చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు గుమ్మడికాయలు, అరకిలో క్యారెట్లతో అయోధ్య రామ మందిరాన్ని త్రీడీ ఆకారంలో 12 ఇంచుల ఎత్తు, 16 ఇంచుల పొడవు, 13 ఇంచుల వెడల్పుతో 4 గంటలు శ్రమించి రూపొందించినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన అనిల్ గతంలో వినాయక చవితి, శివరాత్రి, క్రిస్మస్ వేడుకల సందర్భంగా దేవుళ్ల ప్రతిమలను రూపొందించారు.
మహాత్మా గాంధీ, అంబేద్కర్, ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, క్రికెటర్ విరాట్ కోహ్లీ తదితర నాయకులను పుచ్చకాయపై కార్వింగ్ చేసి ఆవిష్కరించాడు. అనిల్ ప్రతిభను గుర్తించి గతేడాది తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ అవార్డును ప్రదానం చేసింది.