
ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం మొదలైంది. సోమవారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో మతపెద్దలు పండుగను అధికారికంగా ప్రకటించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ఆచరించేందుకు సిద్దమయ్యారు. నెలవంక దర్శనం తర్వాత ట్విటర్లో రంజాన్ శుభాకాంక్షల హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్గా నిలిచింది. రంజాన్ మాసం ఈసారి మండు వేసవిలో ప్రారంభమైన నేపథ్యంలో ఉపవాస దీక్షలు చేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. కాగా,కేరళలో సోమవారం నుంచే రంజాన్ మాసం మొదలైనట్లు స్థానిక మతపెద్దలు పేర్కొన్నారు. పొరుగుదేశం పాకిస్థాన్ లో రంజాన్ ప్రారంభ తేదీ పై భిన్నప్రకటలు చేయడం వివాదానికి దారితీసింది.
ముస్లిం ఉద్యోగులకు పనివేళల కుదింపు
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం, మైనారిటీ ప్రభుత్వ, టీచర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పనివేళలను కుదిస్తూ సీఎస్ ఎస్ కె జోషి ఉత్తర్వులు జారీచేశారు. వర్కింగ్ డేస్ లో సాయంత్రం 4 గంటలకే వెళ్లేందుకు వారికి ప్రత్యేక అనుమతిచ్చారు. జూన్ 4వరకు ఈ సడలింపు వర్తిస్తుందని సీఎస్ చెప్పారు.
రంజాన్ నెల శుభాకాంక్షలు: ఈటల
రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా ముస్లింలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలందరికీ అల్లా దీవెనలు లభించాలని ఆకాంక్షించారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు.