గోదావరిఖని, వెలుగు : రామగుండంలో రాజకీయాలు రోజురోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు అధిష్టానం టికెట్ కేటాయించి, బీ‒ఫాం కూడా ఇచ్చినప్పటికీ.. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఇంకా టికెట్ కోసంప్రయత్నాలు చేస్తుండడం విశేషం. మంగళవారం హైదరాబాద్ ప్రగతి భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు, సోమారపు సత్యనారాయణ మధ్య జరిగిన చర్చల్లో.. చందర్కు మద్దతు తెలపాలని కేటీఆర్కోరినట్టు తెలిసింది.
ఈ సందర్భంగా సత్యనారాయణకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే, రామగుండంలో కోరుకంటి చందర్ గెలవడని, తనకే బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఇండిపెండెంట్గా పోటీచేస్తే ఆర్థికంగా సహకారం అందించాలని సత్యనారాయణ కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిసింది. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే తిరిగి బీఆర్ఎస్ పార్టీలోనే చేరుతానని, కానీ తనకు ఎమ్మెల్సీ పదవి వద్దని కేటీఆర్కు చెప్పినట్టు సత్యనారాయణ సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాకుండా సత్యనారాయణ వర్గానికి జడ్పీ చైర్మన్ అవకాశంతో పాటు పలు గ్రామాలకు సర్పంచ్, ఎంపీపీ పదవులను కూడా కేటీఆర్ ఆఫర్ చేసినట్టు తెలిసింది.
ఈ క్రమంలో తన సన్నిహితులు, అభిమానులతో ఆయన బుధవారం తన నివాసంలో అంతర్గతంగా మీటింగ్ పెట్టి కేటీఆర్తో చర్చించిన విషయాలను వెల్లడించినట్టు తెలిసింది. అయితే, బీజేపీకి రాజీనామా చేసి రామగుండం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన సత్యనారాయణ.. తాజా పరిణామాల నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్లో చేరితే తమ పరిస్థితి ఏమిటని ఆయనతో తిరిగిన పలువురు లీడర్లు సందిగ్ధంలో పడ్డారు. కోరుకంటి చందర్తో విభేదించి బయటకు వచ్చి ఇతని వైపు చేరితే.. ఆయనే బీఆర్ఎస్లో చేరుతుండడం వల్ల తమ దారి తాము చూసుకుంటామనే ఆలోచనతో వారు అడుగులు ముందుకు వేసేందుకు సిద్ధమవుతున్నారు.