గోదావరిఖని, వెలుగు: రామగుండం మున్సిపల్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బడికెల రాజలింగం(67) అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. పది రోజులుగా కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో లివర్, కిడ్నీ, శ్వాసకోశ సంబంధ వ్యాధులకు ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి వెంటిలేటర్తో గోదావరిఖని లక్ష్మినగర్లోని ఆయన ఇంటికి తీసుకువచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున 4.10 గంటలకు తుది శ్వాస వదిలారు. సింగరేణి కార్మికుడి కుమారుడైన బడికెల రాజలింగం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ కాకా వెంకటస్వామి అనుచరుడిగా, మల్టిపుల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్కు నాయకుడిగా వ్యవహరించారు. ఎన్టీపీసీలో ఐఎన్టీయూసీ అనుబంధ మజ్దూర్ యూనియన్ 17 సార్లు గుర్తింపు సంఘంగా గెలవడంలో ముఖ్య భూమిక పోషించారు. తాండూర్ కోల్ మైన్స్ లేబర్ యూనియన్లో పనిచేస్తూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రమశక్తి అవార్డు అందుకున్నారు. 1994లో మేడారం ఎస్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్పై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2004లో కాకా వెంకటస్వామి చొరవతో రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి చైర్మన్గా గెలుపొందారు. ప్రస్తుతం ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. బడికెల రాజలింగం సోదరుడు శ్యామ్ నెల రోజుల క్రితమే మరణించగా, నేడు ఆయన చనిపోవడం కుటుంబంతో పాటు పారిశ్రామిక ప్రాంతంలో తీరని విషాదాన్ని నింపింది. గోదావరి ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు.
సంతాపం ప్రకటించిన వివేక్ వెంకటస్వామి
రామగుండం మున్సిపల్ మాజీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్, ఐఎన్టీయూసీ నాయకులు బడికెల రాజలింగం మృతిపట్ల మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. గోదావరిఖని లక్ష్మినగర్లోని వారి నివాసానికి వెళ్లి రాజలింగం మృతదేహంపై పూలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీపీసీ, సింగరేణి సంస్థలలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారంలో రాజలింగం ఎంతో కీలకంగా పనిచేశారని కొనియాడారు. రామగుండం మున్సిపల్ చైర్మన్గా ఈ ప్రాంత అభివృద్ధి కోసం సేవలందించారన్నారు. నాన్న కాకా వెంకటస్వామితో, తనతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాజలింగం మృతిపట్ల ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.