చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పోలీస్ అవుట్ పోస్టు వద్ద మహిళపై అత్యాచారం చేసినందుకు యూపీ సబ్ ఇన్స్పెక్టర్పై మూడు నెలల తర్వాత కేసు నమోదైంది. ఆగస్టులో పోలీసు అవుట్ పోస్టు వద్ద ఒక మహిళపై అత్యాచారం చేసి, ఆమె భర్తను కొట్టాడనే ఆరోపణలతో బరేలీకి చెందిన పోలీసు అధికారితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది.
పోలీస్ అవుట్ పోస్టు వద్ద ఎస్సై అరుణ్ కుమార్ తనపై అత్యాచారం చేశాడని భాదితురాలు గత ఆగస్టు 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు నిందితులపై ఎటువంటి చర్య తీసుకోలేదు. ఎందుకంటే అరుణ్ కుమార్ అంతకుముందే ఒక కేసు విషయమై భాదితురాలి భర్తతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాడు.
బాధితురాలి భర్తకు చెందిన బంధువు ఒక బాలికతో పారిపోయాడు. ఆ ఘటనతో ఆమె భర్తకు సంబంధముందనే అనుమానంతో ఎస్సై అరుణ్ ఆమె భర్తతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాడు. దానికి ప్రతీకారంగానే సదరు మహిళ ఎస్సై అరుణ్ కుమార్పై ఫిర్యాదు చేసిందని పోలీసులు అంటున్నారు.
బాలికను కనిపెట్టడమే ముఖ్యమని కేసును విచారిస్తున్న బహేరి ఎస్హెచ్ఓ రామ్ అవతార్ సింగ్ అన్నారు. అంతేకాకుండా ‘బాలిక మిస్సింగ్ కేసులో భాదితురాలి భర్త కూడా నిందితుల్లో ఒకరు. బాలిక కనిపించకుండా పోయిన రోజు నుండి భాదితురాలి భర్త కూడా కనిపించకుండా పోయినట్లు పోలీసులు గుర్తించారు. మేం అతన్ని పోలీసు అవుట్పోస్టు వద్ద మాత్రమే ప్రశ్నించాం. బాలికను ఎలాగైన కనిపెట్టాలనే ఉద్దేశంతో అతని సహాయం కోరాం. తన భర్తను అదుపులోకి తీసుకున్నామనన్న ప్రతీకారంతోనే బాధితురాలు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఎందుకంటే బాలిక మిస్సింగ్ కేసులో ఆమె భర్తతో పాటు వారి బంధువులు ఇద్దరు కూడా అనుమానితులుగా ఉన్నారు’ అని ఆయన తెలిపారు.
ఇదంతా జరిగిన కొన్ని రోజుల తర్వాత మిస్సైన బాలిక హైకోర్టుకు హాజరై.. తాను ఒక యువకుడిని ప్రేమించానని, ఆ యువకుడితోనే కలిసి జీవిస్తానని కోర్టుకు తెలిపింది. ఈ కేసు గురించి ఎస్ఎస్పి శైలేష్ పాండే మాట్లాడుతూ.. సీజేఎం ఉత్తర్వులను అనుసరించి సబ్ ఇన్స్పెక్టర్, మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసును విచారిస్తున్న బహేరి ఎస్హెచ్ఓ త్వరలోనే తన నివేదికను అందజేస్తారని ఆయన తెలిపారు.
For More News..