ప్రభుత్వ ఉద్యోగినిని బదిలీ చేయిస్తానని అత్యాచారం

ప్రభుత్వ ఉద్యోగినిని బదిలీ చేయిస్తానని అత్యాచారం

ఆదిలాబాద్: ఉద్యోగ రీత్యా తన భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళా ఉద్యోగినిని బదిలీ చేయిస్తానని భారీగా డబ్బులు తీసుకోవడమే కాకుండా ఆమెపై అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసిన వీడియోలు, ఫొటోలు ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలు లాగిన మోసగాడి ఆట కట్టించింది ఆ మహిళా ఉద్యోగిని. ఇన్ని రోజులు భర్తకు చెబితే పరువు పోతుందని ఓపిక పట్టిన ఆ మహిళకు మోసగాడి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో.. అసలు విషయం భర్తకు చెప్పింది. భర్త సాయంతో పోలీసులకు చెప్పడంతో ఆ మోసగాడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టామని తెలిపారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.

వివరాలు: ఆదిలాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ(35) భర్త హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలు, భర్తతో హైదరాబాద్ లోనే ఉండాలని ఆమె ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు బదిలీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో బంధువుల ద్వారా మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, మామిడిపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గాలిపెల్లి చంద్రశేఖర్ 2017లో ఆ మహిళకు పరిచయమయ్యాడు. తనకు మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుసని, హైదరాబాద్ కు తరలిస్తానని ఆమెను నమ్మించి కొంత డబ్బు తీసుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక బాధితురాలిని నమ్మించి హైదరాబాద్ కు తీసుకెళ్లి చంద్రశేఖర్ ఇంట్లో అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఆమె ఫొటోలు, వీడియోలు ఉన్నాయని బెదిరిస్తూ.. రూ.10 లక్షల క్యాష్, 35 తులాల గోల్డ్ తీసుకున్నాడు. అయినా మరింత డబ్బు కావాలని వేధిస్తుండటంతో.. ఆమె అక్టోబర్ 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.