వారేవా ఏమి స్పీడు!

వారేవా ఏమి స్పీడు!

టాలీవుడ్‌‌లో స్టార్ హీరోయిన్‌‌గా దూసుకెళ్తున్న రష్మిక.. ‘పుష్ప’ తర్వాత ఇతర భాషల్లోనూ ఫుల్ బిజీ అయింది. హిందీతో పాటు తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం తమిళ హీరో విజయ్‌‌కి జంటగా ‘వారసుడు’ చిత్రంలో నటిస్తోందామె. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదింకా సెట్స్‌‌పై ఉండగానే రష్మిక తమిళంలో మరో చాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కేజీయఫ్ మైన్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో సాగే ఈ పీరియాడిక్‌‌ యాక్షన్ డ్రామాలో హీరోయిన్‌‌ పాత్రకు రష్మికను సంప్రదించినట్టు తెలుస్తోంది. విక్రమ్‌‌ లాంటి వెర్సటైల్ యాక్టర్ నటిస్తుండటం, త్రీడీలో రూపొందుతున్న భారీ చిత్రం కావడంతో ఆమె కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కోలీవుడ్‌‌లోనే కాదు.. బాలీవుడ్‌‌లోనూ ఆమె మరో కొత్త సినిమాకి ఓకే చెప్పిందట. టైగర్ ష్రాఫ్ హీరోగా శశాంక్ ఖేతన్ డైరెక్షన్‌‌లో ఓ సినిమా మొదలు కానుంది. కరణ్‌‌ జోహార్ నిర్మించనున్న ఈ చిత్రంలో రష్మికనే హీరోయిన్‌‌గా తీసుకున్నారట. సెప్టెంబర్‌‌‌‌ నుంచి పోర్చుగల్‌‌లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. రీసెంట్‌‌గా టైగర్‌‌‌‌తో కలిసి ఓ యాడ్‌‌లో కూడా నటించింది రష్మిక. ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాల షూట్స్ కంప్లీట్ చేసి, ‘యానిమల్’ షూటింగ్‌‌లోనూ పాల్గొంటోంది. మరోవైపు ఆమె కీలకపాత్ర పోషించిన తెలుగు చిత్రం ‘సీతారామం’ వచ్చే నెల 5న విడుదల కాబోతోంది. ‘పుష్ప 2’ షూట్ స్టార్ట్ కావాల్సి ఉంది.