50 ఓవర్లంటే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నరు 

50 ఓవర్లంటే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నరు 

ఉరుకుల పరుగుల జీవితాల్లో దేన్నైనా షర్ట్ కట్ గా ఆలోచిస్తున్న ఈ రోజుల్లో గంటల తరబడి క్రికెట్ మ్యాచ్ లు చూసే రోజులు పోయాయి. ఈ క్రమంలోనే టీ20 లీగ్స్ కు  క్రేజ్ పెరుగుతుండగా.. కొన్ని దేశాల్లో టీ10 లీగ్స్ కూడా ఆడిస్తున్నారు. ధనాధన్ షాట్స్, చివరి బాల్ వరకు కిక్కే కిక్కు.. క్షణాల్లోనే మారిపోతున్న మ్యాచ్ స్వరూపం. నిమిషాల్లోనే విక్టరీ ఫలితం. దీన్నే కోరుకుంటున్నారు అభిమానులు కూడా. ఐపీఎల్ తర్వాత పలు దేశాల్లో లీగ్స్ వచ్చేశాయి. టెస్టు మ్యాచ్ లైతే బోర్ అని, వన్డే మ్యాచ్ లను కాస్త సపోర్ట్ చేస్తున్నారు. ఇదే విషయంపై తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వన్డేల గురించి మాట్లాడుతూ... వన్డేలు 50 ఓవర్ల పాటు కొనసాగుతుండటంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారని... ఈ ఫార్మాట్ ను 40 ఓవర్లకు కుదిస్తే మంచిదని చెప్పారు. మ్యాచ్ వ్యవధిని తగ్గించడం వల్ల వన్డేలకు వచ్చే ప్రమాదం ఏమీ లేదన్నారు. 

వన్డేలు ప్రారంభమయినప్పుడు 2 టీమ్స్ 60 ఓవర్ల చొప్పున ఆడేవని... ఆ తర్వాత వాటిని 50 ఓవర్లకు తగ్గించారని రవిశాస్త్రి గుర్తు చేశారు. అప్పట్లో 10 ఓవర్లు తగ్గించడం వల్ల వన్డేలకు ఆదరణ తగ్గలేదని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 ఓవర్ల మ్యాచ్ లు ఆడుతున్నామని తెలిపారు. చాలాకాలంగా 50 ఓవర్లతో కొనసాగుతున్న ఈ ఫార్మాట్ ను ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 50 ఓవర్లు చాలా ఎక్కువని... అందువల్ల సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తేనే ఈ ఫార్మాట్ బతుకుతుందని అన్నారు. 

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ వన్డేలకు గుడ్ బై చెప్పినప్పటి నుంచి ఈ ఫార్మట్ పై పెద్ద చర్చ జరుగుతోంది. వన్డేలకు క్రేజ్ తగ్గుతోందని...ఇంటర్నేషనల్ క్రికెట్ షెడ్యూల్ నుంచి ఈ ఫార్మాట్ ను క్రమంగా తొలగించాలని పాక్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ లాంటి దిగ్గజ క్రికెటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు.