గండిపేట్,వెలుగు: ప్రజలకు సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ డిఫ్యూటి కమిషనర్ రవికుమార్ సూచించారు. సోమవారం వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. చెత్త సేకరణ ఆటోలు, ఓపెన్ పాయింట్లు, తాగునీటి సమస్య, విద్యుత్ వంటి వసతులపై ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. ప్రజలు చెత్త, చెదారాలు రోడ్లపై వేయకుండా అవగాహన కల్పించాలన్నారు.
చెత్త సేకరణ ఆటో రిక్షా కార్మికులు ప్రతి రోజు ఇంటింటికి వెళ్లి సేకరించేలా చూడాలన్నారు. తమకు కేటాయించిన కాలనీలు, బస్తీలలతో ప్రతి రోజు తిరుగుతూ ఇంటింటికి వెళ్లి చెత్తను తీసుకోవాలన్నారు. ఎవరైనా చెత్తను అందించకపోతే అధికారులకు, సిబ్బంది దృష్టికి తీసుకురావాలన్నారు. ఇళ్ల మధ్య చెత్త ఓపెన్ పాయింట్లు లేకుండా జవాన్లు చూసుకోవాలన్నారు. సమయ పాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎస్డబ్ల్యూఎం, ఎస్ఎస్లు, ఎస్ఎఫ్ఏలు పాల్గొన్నారు.