- రూ.2400 కోట్లకు పైగా ఫెమా ఉల్లంఘనకు సంబంధించి చర్యలు
- వన్-టైమ్ సెటిల్మెంట్గా రూ. 17.76 కోట్లు చెల్లించాలి
- ఐదుగురు డైరెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.18 లక్షల చొప్పున జరిమానా
- కాంపౌండింగ్ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్బీఐ
హైదరాబాద్, వెలుగు: అపోలో హాస్పిటల్స్సహా ఐదుగురు డైరెక్టర్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝులిపించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి డైరెక్టర్లు ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి, ఎస్.కె. వెంకట్రామన్, అఖిలేశ్వరన్ కృష్ణన్, ఎస్.ఎం. కృష్ణన్కు ఒక్కొక్కరికి రూ.18 లక్షల చొప్పున జరిమానా విధించింది. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూ. 17.76 కోట్లు కాంపౌండింగ్ ఫీజ్ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
దేశీయ రిటైల్ వ్యాపారంలో ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా రూ.2400 కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్వీకరించారనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్అభియోగాల మేరకు ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ఈ మేరకు హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం..
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఆధ్వ్యర్యంలో నిర్వహిస్తున్న సంస్థల్లో రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి గతంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ రూ. 859.87 కోట్లు విదేశీ పెట్టుబడులను స్వీకరించినట్లు గుర్తించింది. ఫారిన్ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్లకు సంబంధించి మొత్తం రూ. 70.02 కోట్లు, విదేశీ పెట్టుబడులను స్వీకరించడం ద్వారా మొత్తం రూ. 623.87 కోట్లు, మల్టీ-బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ ఉల్లంఘనలు సహా మొత్తంగా రూ. 870.67 కోట్లు అనధికారిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ దర్యాప్తులో వెలుగు చూసింది.
ఇలా మొత్తం రూ.2400 కోట్లకు పైగా ఫెమా నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగినట్లు అడ్జుడికేటింగ్ అథారిటీకి ఈడీ ఫిర్యాదు చేసింది. ఫెమా సెక్షన్16 కింద చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ కాంపౌండింగ్ జారీ చేసేందుకు ఈడీకి లెటర్ రాసింది. ఈడీ నో అబ్జెక్షన్ ఇవ్వడంతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్తో పాటు డైరెక్టర్లపై ఫెమా నిబంధనల ప్రకారం ఆర్బీఐ జరిమానా విధించింది.
