- తొలిసారిగా గోదావరిఖని సింగరేణి హాస్పిటల్లో కార్డియార్ కేర్ సెంటర్
- గని, రిటైర్డ్ కార్మికులు, కుటుంబ సభ్యులకు, స్థానికులకు ట్రీట్మెంట్
- ఇప్పటికే ప్రారంభమైన ఓపీ సేవలు
- సెంటర్ను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో గనులు, ఆఫీసులో గుండెపోటుకు గురయ్యే కార్మికులు, ఉద్యోగులకు స్థానికంగా ప్రాథమిక వైద్యం అందించి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు రెఫర్ చేసేవారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించితే ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. గత కొన్నేండ్లలో చాలా మంది కార్మికులు, ఉద్యోగులు గుండెపోటుతో చనిపోయారు. ఇప్పుడు ఈ ప్రమాదాన్ని తప్పించేందుకు సింగరేణి సంస్థ తొలిసారిగా గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్లో ‘క్యాథ్ ల్యాబ్ సెంటర్’ను ఏర్పాటు చేసింది. పీపీపీ పద్ధతిలో ఈ సెంటర్ను ఏర్పాటు చేయగా, గని కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్లతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు కూడా వైద్య సేవలు అందించనున్నారు. ప్రస్తుతం ఓపీ సేవలు మొదలయ్యాయి. సెంటర్ను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.
49 ఏండ్ల తర్వాత మొదటి సారిగా..
సింగరేణి సంస్థ గోదావరిఖని చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసే గని కార్మికులకు వైద్య సేవలందించేందుకు 1977 అక్టోబర్ 2న ఏరియా హాస్పిటల్ను ప్రారంభించింది. ఇప్పటివరకు జనరల్ సర్జన్, ఆర్థో, మానసిక, పిల్లల వైద్య సేవలు, గైనకాలజీ వంటి సేవలు మాత్రమే అందించారు. గుండెకు సంబంధించిన ట్రీట్మెట్ ఈ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకురాలేదు. గుండెపోటుకు గురయ్యే వారికి జనరల్ చెకప్ చేసిన అనంతరం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్గానీ, 250 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్కు గానీ రెఫర్ చేసేవారు. ఇంత దూరం ప్రయాణించే లోపే పరిస్థితి విషమంగా మారితే రోగులు చనిపోయేవారు. గుండె సంబంధిత వ్యాధితో ఎవరూ చనిపోకూడదన్న ఉద్దేశంతో సింగరేణి మేనేజ్మెంట్49 ఏండ్ల తర్వాత గోదావరిఖని హాస్పిటల్లో ‘క్యాథ్ ల్యాబ్ సెంటర్’ ఏర్పాటుకు ముందుకొచ్చింది.
కార్మికులతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారికీ...
సింగరేణి సంస్థ ‘పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్’ (పీపీపీ) పద్ధతిలో చేపట్టిన ఈ క్యాథ్ ల్యాబ్ సెంటర్ నిర్వహణ బాధ్యతలను ఏడేండ్ల పాటు కరీంనగర్కు చెందిన రెనే హాస్పిటల్కు అప్పగించింది. రూ.18 కోట్ల విలువైన కార్పొరేట్ హాస్పిటల్లో వినియోగించే మిషన్ను ఈ సెంటర్లో ఏర్పాటు చేశారు. ఈ క్యాథ్ ల్యాబ్ సెంటర్లో సింగరేణి కార్మికులు, ఆఫీసర్లు వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులకు సైతం చికిత్స అందించనున్నారు. మొత్తం 15 బెడ్లు ఉండగా ఇందులో ఎనిమిది సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు, మిగిలిన ఏడు బెడ్లు ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించారు. గోదావరిఖనితో పాటు మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని యైటింక్లయిన్ కాలనీ, సెంటినరీకాలనీ, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి ప్రాంతాలకు చెందిన వారికి వైద్యం అందుబాటులో ఉండనుంది.
సీజీహెచ్ఎస్ రేట్ల ప్రకారమే ట్రీట్మెంట్...
సింగరేణి ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ సెంటర్కు వచ్చే రోగులపై ఆర్థికభారం పడకుండా ‘సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్’ (సీజీహెచ్ఎస్) ప్రకారమే ఫీజులు వసూలు చేయనున్నారు. 2డీ ఎకో, టీఎంటీ, ఈసీజీ, టీఈఈ వంటి పరీక్షలు చేసిన తర్వాత గుండెకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే యాంజియోగ్రామ్ చేసి స్టంట్స్ వేయడం లేక టెంపరరీ, పర్మినెంట్ ఫేస్ మేకర్ను అమర్చడం చేయనున్నారు. ప్రస్తుతం ఇద్దరు కార్డియాలజిస్ట్లు అందుబాటులో ఉండగా.. వీరు ఓపీ సేవలు అందిస్తున్నారు. మెషినరీ బిగించడం పూర్తి కావడంతో త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్రాజ్ కుమార్ తెలిపారు. గుండెకు సంబంధించిన ట్రీట్మెంట్ అందుబాటులోకి రావడంతో సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
