
న్యూఢిల్లీ: ఆర్బీఐ దగ్గరున్న బంగారం నిల్వల పరిమాణం 2025–-26 ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెళ్లలో 880 మెట్రిక్ టన్నులు దాటింది. ఇది సెప్టెంబరు చివరి వారంలో 0.2 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొంది. 2025 సెప్టెంబరు 26 నాటికి మొత్తం బంగారం విలువ 95 బిలియన్ డాలర్లకు చేరింది.
పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితుల సమయంలో, సురక్షితమైన ఆస్తిగా పరిగణించే బంగారానికి ఇటీవల డిమాండ్ భారీగా పెరిగింది. సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల్లో, ఆర్బీఐ 0.6 మెట్రిక్ టన్నుల (600 కిలోలు) బంగారాన్ని కొనుగోలు చేసింది.
సెప్టెంబరులో 0.2 మెట్రిక్ టన్నులు (200 కిలోలు), జూన్లో 0.4 మెట్రిక్ టన్నులు (400 కిలోలు) పసిడిని కొనుగోలు చేసింది. ఆర్బీఐ వద్ద మొత్తం బంగారం నిల్వలు 2024-–25 చివరిలో 879.58 మెట్రిక్ టన్నులు ఉండగా, సెప్టెంబరు నాటికి 880.18 ఎంటీలకు చేరాయి.