- అందుకే ఆర్బీఎల్ బోర్డ్లో ఆర్బీఐ జోక్యం
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా ఆర్బీఎల్ బ్యాంక్కు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ బ్యాంకుల బోర్డులో తమ వ్యక్తులను పెట్టదు. ఏదైనా సమస్య ఉందనుకుంటేనే ఇలా చేస్తుంది. ఆర్బీఎల్ బ్యాంక్ ఓ కంపెనీకి రూ. 300 కోట్ల లోన్ను మంజూరు చేసి, తర్వాత 7 ఏడు నెలల్లోనే ఆ లోన్ను రైటాఫ్ (ఆ లోన్ రికవరీ కాదని నిర్ణయించుకోవడం, బ్యాలెన్స్ షీట్ నుంచి ఆ లోన్ను తీసేయడం) చేసిందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. ఈ లోన్ను కన్సార్టియంలో భాగంగా 2018 లో ఆర్బీఎల్ ఓ కంపెనీకి ఇచ్చింది. బ్యాంక్ లోన్ పోర్టుఫోలియో డిటెయిల్స్ను ఇవ్వాలని గత కొన్ని నెలల నుంచి రిస్క్ డిపార్ట్మెంట్ను ఆర్బీఐ అడుగుతోందని బ్యాంకు ఉద్యోగి ఒకరు చెప్పారు. ఏ కంపెనీకి లోన్ ఇచ్చారో చెప్పలేదు. ‘తప్పుగా జరిగిందని ఏ ఒక్క ట్రాన్సాక్షన్ను ఆర్బీఐ వేలెత్తి చూపలేదు. కానీ, ఏదో జరుగుతోందని భావిస్తోంది. తాజాగా కొంత మంది బ్యాంక్ బోర్డు డైరెక్టర్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర్ రావును కలిశారు. కానీ, ఆర్బీఐ ఏం ప్లాన్ చేస్తోందో వీరికి క్లారిటీ రాలేదు’ అని అన్నారు. ఆర్బీఎల్ సీఈఓ పొజిషన్ నుంచి విశ్వవీర్ అహుజాను దిగిపోమని చెప్పినప్పటికీ ఆయన దిగలేదు. దీంతో యెస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ల్లో చేసినట్టే ఆర్బీఎల్ బ్యాంక్లో కూడా రిజర్వ్ బ్యాంక్ చేసింది. అహుజా రీఅపాయింట్మెంట్ను కేవలం ఏడాది కాలానికి ఆర్బీఐ అంగీకరించింది. కానీ, ఆర్బీఎల్ బ్యాంక్ మాత్రం మూడేళ్లకు ఇవ్వాలని కోరింది. మరోవైపు ఆర్బీఎల్ బ్యాంక్ ఇంటెరిమ్ సీఈఓ, ఎండీగా రాజీవ్ అహుజాను నియమించడానికి ఆర్బీఐ అంగీకరించింది. మూడు నెలలు లేదా రెగ్యులర్ అపాయింట్మెంట్ జరిగేంత వరకు రాజీవ్ ఈ పదవిలో ఉంటారు.