బిజినెస్​ మోడల్​ వల్లే  క్రైసిస్‌‌లో యూఎస్ బ్యాంకులు :​ శక్తికాంత దాస్​

బిజినెస్​ మోడల్​ వల్లే  క్రైసిస్‌‌లో యూఎస్ బ్యాంకులు :​ శక్తికాంత దాస్​

ముంబై: దేశంలోని బ్యాంకుల బిజినెస్​ మోడల్స్​ సరిగానే ఉన్నాయా లేదా అనే దానిని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా లోతుగా పరిశీలిస్తున్నట్లు గవర్నర్​ శక్తికాంత దాస్​ వెల్లడించారు. బ్యాంకుల వ్యూహాలు తగినట్లుగా లేకపోతే క్రైసిస్​కు దారితీసే ప్రమాదం ఉందన్నారు. బిజినెస్​ మోడల్స్​ సరిగా లేకపోవడం వల్లే  సిలికాన్​ వ్యాలీ బ్యాంకుతో పాటు మరికొన్ని బ్యాంకులు  అమెరికాలో కుప్పకూలుతున్నాయని శక్తికాంత దాస్​ వ్యాఖ్యానించారు. ఈ క్రైసిస్​ ఫైనాన్షియల్​ సిస్టమ్​ మొత్తంపై ఎఫెక్ట్​ చూపకుండా ఆపడానికి కష్టాలు పడాల్సి వస్తోందని అన్నారు. మన దేశంలోని బ్యాంకులు పటిష్టంగానే ఉన్నాయని, ఇతర దేశాలలోని క్రైసిస్​ ప్రభావం మన బ్యాంకులపై పడలేదని పేర్కొన్నారు.  మన బ్యాంకులతో పాటు, ఆర్​బీఐ తీసుకున్న చొరవే ఇందుకు కారణమని దాస్​ చెప్పారు. అమెరికాలోని కొన్ని బ్యాంకులు కుప్పకూలడంతో వాటి బిజినెస్​ మోడల్స్​పై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

ఇక్కడి బ్యాంకుల  బిజినెస్ ​మోడల్స్​పై కన్నేశాం....

ఈ నేపథ్యంలో దేశంలోని బ్యాంకుల బిజినెస్​ మోడల్స్​ను నిశితంగా గమనిస్తున్నామని, ఏవైనా లోపాలుంటే క్రైసిస్​కు దారి తీసే ప్రమాదం పొంచి ఉందని ఆర్​బీఐ గవర్నర్​ చెప్పారు. ఆర్​బీఐకి అనుబంధంగా  ఏర్పాటైన కాలేజ్​ ఆఫ్​ సూపర్వయిజర్స్​ నిర్వహించిన ఒక గ్లోబల్​ కాన్ఫరెన్స్​లో శక్తికాంత దాస్​ మాట్లాడారు.  బిజినెస్​ మోడల్స్​ కొన్నిసార్లు బ్యాంకుల బాలెన్స్​ షీట్లలో రిస్క్​లకు కారణం కావచ్చని ఆయన చెప్పారు. ఇలాంటివి సరయిన సమయంలో గుర్తించకపోతే పెద్ద క్రైసిస్​లు ఎదుర్కోవల్సి వస్తుందన్నారు. ఒకప్పుడు సేఫ్​గా అంచనా వేసిన అంశాలే ఆ తర్వాత బ్యాంకుల బాలెన్స్​ షీట్లలో సమస్యలుగా మారడం వల్లే ఇటీవల అమెరికా, యూరప్‌‌లలోని కొన్ని బ్యాంకులు ఇబ్బందులపాలయ్యాయని అభిప్రాయపడ్డారు. ఎసెట్​, లయబిలిటీల మధ్య బాలెన్స్​ను సరి చూసుకోకపోవడం వల్లే సిలికాన్​ వ్యాలీ బ్యాంకు కుప్పకూలిందని ఎనలిస్టులు చెబుతుండటాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఫైనాన్షియల్​ రిస్కులను ఎప్పటికప్పుడు బ్యాంకుల మేనేజ్​మెంట్లు, బోర్డులు పట్టించుకుంటూ ఉండాలని, అవసరమైతే తగినంత క్యాపిటల్​, లిక్విడిటీ నిల్వలను ఏర్పాటు చేసుకునే దిశలో చర్యలు తీసుకోవాలని దాస్​ సూచించారు. పటిష్టత అనేది వాటి బిజినెస్​ మోడల్స్​, వ్యూహాలతో లింక్​ అయి ఉంటుందని చెప్పారు. క్యాపిటల్​, లిక్విడిటీ నిల్వల విషయంలో పాటించాల్సిన నిబంధనలను, మార్కెట్లో  క్యాపిటల్ సులభంగా దొరికే టైములో సమీకరించి నిల్వ చేసుకోవాల్సిందిగానూ బ్యాంకులకు ​ ఆర్​బీఐ సూచించిందని దాస్​ తెలిపారు.

మన బ్యాంకులు భేష్​....

 దేశంలోని  బ్యాంకులు ఎన్​పీఏలు తగ్గించు కోవడంతోపాటు, తగిన క్యాపిటల్​ నిల్వలనూ ఏర్పాటు చేసుకున్నాయని శక్తికాంత దాస్​ వివరించారు. డిసెంబర్​ 2022 నాటికి బ్యాంకుల గ్రాస్​ఎన్​పీఏలు 4.41 శాతానికి తగ్గాయని, అంతకు ముందు మార్చి 2022 నాటికి ఇవి 5.8 శాతంగా ఉన్నాయని వెల్లడించారు. మార్చి 2021 చివరినాటికి దేశంలోని బ్యాంకుల గ్రాస్​ ఎన్​పీఏలు 7.3 శాతమని చెప్పారు. డిసెంబర్​ 2022 నాటికి మన బ్యాంకుల క్యాపిటల్​ యాడిక్వసీ రేషియో 16.1 శాతమని, ఇది నిబంధనల  ప్రకారం ఉండవల్సిన దానికంటే  ఎక్కువేనని వెల్లడించారు. ఒత్తిడి ఎక్కువైన సమయంలోనూ తట్టుకునే సామర్ధ్యం షెడ్యూల్డ్​ కమర్షియల్​ బ్యాంకులకు ఉందని దాస్​ చెప్పారు. వేగంగా గ్రోత్​ సాధించాలని కోరుకోవడం లేదా ఆలోచనా రహితంగా లాభాల వెనక పరిగెత్తడం వంటివే బ్యాంకుల వైఫల్యాలకు దారి తీస్తాయని దాస్​ ఈ సందర్భంగా తెలిపారు.