ఇంటిగ్రేటెడ్​ అంబుడ్స్​​మన్​ స్కీం కిందకు క్రెడిట్​ ఇన్ఫర్మేషన్​ కంపెనీలు

ఇంటిగ్రేటెడ్​ అంబుడ్స్​​మన్​ స్కీం కిందకు క్రెడిట్​ ఇన్ఫర్మేషన్​ కంపెనీలు
  • ఇంటిగ్రేటెడ్​ అంబుడ్స్​​మన్​ స్కీం కిందకు క్రెడిట్​ ఇన్ఫర్మేషన్​ కంపెనీలు
  •  కస్టమర్లు ఇప్పుడు ఆర్​బీఐకి కంప్లెయింట్​ చేయొచ్చు

బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్​ కంపెనీల నుంచి లోన్లు పొందడంలో సిబిల్​, ఎక్స్​పీరియన్​ వంటి  ఇన్ఫర్మేషన్​ కంపెనీలు ఇచ్చే రిపోర్టులు కీలకం. కొన్నిసార్లు వీటి రిపోర్టుల్లో తప్పుల వల్ల కస్టమర్​ నష్టపోతున్నాడు. వాటిని మార్చమంటే కంపెనీల నుంచి తగిన రెస్పాన్స్ ​రావడం లేదనే కంప్లైంట్లు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ఆర్​బీఐ రంగంలోకి దిగింది. ఇలాంటి సమస్యలు ఏవైనా ఎదురైతే ఇప్పుడు వీటిపై నేరుగా తమకే కంప్లెయింట్​ చేయొచ్చని చెబుతోంది.

వెలుగు బిజినెస్​ డెస్క్​: 
హఠాత్తుగా మీ క్రెడిట్​ స్కోరు పడిపోయిందా....కారణం ఏమిటనేది మీ క్రెడిట్​ బ్యూరో చెప్పడం లేదా...అక్మస్మాత్తుగా మీ క్రెడిట్​ రిపోర్టులో ఏదైనా కొత్త లోన్​ అకౌంట్​ కనిపించిందా....బ్యూరోను అడిగితే....సంబంధిత ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్​తో కనుక్కోండి అని తప్పించుకుంటోందా....ఇలాంటి సమస్యలు ఏవైనా ఎదురైతే ఇప్పుడు క్రెడిట్​ ఇన్ఫర్మేషన్ ​కంపెనీలపై ఆర్​బీఐకి కంప్లెయింట్​ చేయొచ్చు. మన కంప్లెయింట్లను తగిన టైములో సంతృప్తికరంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్​ కంపెనీలు పరిష్కరించకపోతే ఆర్​బీఐ వద్దకు మనం వెళ్లొచ్చు.

క్రెడిట్​ బ్యూరోలన్నింటిదీ అదే వైఖరి...
సిబిల్​, ఎక్స్​పీరియన్​, ఈక్విఫాక్స్, క్రిఫ్​హైమార్క్​​ వంటి క్రెడిట్​ ఇన్ఫర్మేషన్​ కంపెనీలు ఇచ్చే రిపోర్టులలో ఏవైనా తప్పులుంటే ....బలయిపోవడమే తప్ప....వాటిని పరిష్కరించుకోవడానికి ఇప్పటిదాకా దారి లేదు. కానీ, తాజాగా క్రెడిట్​ ఇన్ఫర్మేషన్​ కంపెనీలన్నింటినీ ఇంటిగ్రేటెడ్​ అంబుడ్స్​​మన్​ స్కీము కిందకి ఆర్​బీఐ తేవడంతో ఇప్పుడు కస్టమర్లకు వెసులుబాటు దొరుకుతుంది. బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు, పేమెంట్​ ఆపరేటర్లు ....అందరినీ ఈ ఇంటిగ్రేటెడ్​ అంబుడ్స్​​మన్​ స్కీము కిందకి గతంలోనే తెచ్చారు.  మానిటరీ పాలసీ ప్రకటించే టైములోనే  తాజా ప్రకటననూ ఆర్​బీఐ చేసింది.

స్కీము ఎలా పనిచేస్తుంది ?
బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు, పేమెంట్​ ఆపరేటర్లు, ఇప్పుడు క్రెడిట్​ ఇన్ఫర్మేషన్​ కంపెనీలు....వీరిలో ఎవరైనా కస్టమర్ల కంప్లెయింట్లకు తగిన సొల్యూషన్​ ఇవ్వడంలో ఫెయిలైతే...ఆర్​బీఐ ఇంటిగ్రేటెడ్​ అంబుడ్స్​​మన్​ స్కీము కలగచేసుకుంటుంది. ఆ కస్టమర్ల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటుంది. ముందుగా సంబంధిత క్రెడిట్​ బ్యూరోకు తన సమస్యను కస్టమర్​ చెప్పుకోవాలి. ఆ క్రెడిట్​ ఇన్ఫర్మేషన్​ బ్యూరో సమస్య పరిష్కారంలో విఫలమైనా లేదా 30 రోజులలో రెస్పాండ్​ కాకపోయినా...అప్పుడు ఆ కస్టమరు ఆర్​బీఐని సంప్రదించొచ్చు. ఆన్​లైన్​లోనే కస్టమరు తన కంప్లెయింట్​ను ఆర్​బీఐకి పంపించుకునే వీలుంది. సీఆర్​పీసీ@ఆర్​బీఐ.ఓఆర్​జీ.ఇన్​(crpc@rbi.org.in) మెయిల్​ ఎడ్రస్​కు కంప్లెయింట్​ను పంపించాలి. లేదా, పోస్టులో చండీగఢ్​లోని సెంట్రలైజ్డ్​ రిసీట్​ అండ్​ ప్రాసెసింగ్​ సెంటర్​కు పంపాలి. మరో మార్గమేమంటే, 14448 టోల్​ ఫ్రీ నెంబర్​పై కాల్​ చేయాలి. తాము ఇచ్చిన కంప్లెయింట్ల స్టేటస్​ను సీఎంఎస్​ పోర్టల్​ద్వారా ట్రాక్​ చేసుకోవచ్చు.

పారదర్శకంగా లేని క్రెడిట్​ బ్యూరోలు....
దేశంలోని క్రెడిట్​ బ్యూరోల పద్ధతులలో పార దర్శకత లేదని అన్సారి చెబుతారు. క్రెడిట్​ స్కోరు ఎందుకు తగ్గిపోతోందో చెప్పకపోవడమే కాకుండా, ఏం చేస్తే మళ్లీ తమ క్రెడిట్​ స్కోరు బెటరవుతుందో కూడా అవి సూచించడం లేదని పేర్కొన్నారు. ఎవరైనా కస్టమరు తన రిపోర్టులో తప్పుందని క్రెడిట్​ బ్యూరోకి చెబితే....అవి సంబంధిత బ్యాంకుతో మాట్లాడుకోమని చెబుతున్నాయి. లేదంటే ఆ కస్టమరు కంప్లెయింట్​ను ఆయా బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలకు పంపిస్తున్నాయి.

ట్విటర్లో వాపోయిన కస్టమర్లు
ఆగస్టు 5న జరిగిన ఒక ట్విటర్​ స్పేస్​ ఈవెంట్లో దేశంలోని నాలుగు క్రెడిట్​ ఇన్ఫర్మేషన్​ కంపెనీలదీ ఒకటే దారని చాలా మంది వాపోయారు. ఇంటిగ్రేటెడ్​ అంబుడ్స్​​మన్​ స్కీము కిందకి తెచ్చిన ఆర్​బీఐ నిర్ణయంపై ఈ ఈవెంట్​ను నిర్వహించారు. కంప్లెయింట్లు ఎప్పుడు పరిష్కారమవుతాయో...అసలు పరిష్కారమవుతాయో లేదో కూడా తెలియదని గోడు వెళ్లబోసుకున్నారు.
మొట్టమొదటిసారిగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్​ కంపెనీలలో జవాబుదారీతనం పెరిగేలా ఆర్​బీఐ చొరవ తీసుకుంది. ఇప్పటిదాకా దేశంలోని క్రెడిట్​ ఇన్ఫర్మేషన్​ కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తమ బాధలు చెప్పుకోవడానికి కూడా కస్టమర్లకు అవకాశం లేకుండా పోయింది.  - కషీఫ్​ అన్సారి, అసిస్టెంట్​ ప్రొఫెసర్​, హన్స్​రాజ్​ కాలేజ్​, యూనివర్శిటీ ఆఫ్​ ఢిల్లీ