- ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీం కిందకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు
- కస్టమర్లు ఇప్పుడు ఆర్బీఐకి కంప్లెయింట్ చేయొచ్చు
బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ కంపెనీల నుంచి లోన్లు పొందడంలో సిబిల్, ఎక్స్పీరియన్ వంటి ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఇచ్చే రిపోర్టులు కీలకం. కొన్నిసార్లు వీటి రిపోర్టుల్లో తప్పుల వల్ల కస్టమర్ నష్టపోతున్నాడు. వాటిని మార్చమంటే కంపెనీల నుంచి తగిన రెస్పాన్స్ రావడం లేదనే కంప్లైంట్లు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఇలాంటి సమస్యలు ఏవైనా ఎదురైతే ఇప్పుడు వీటిపై నేరుగా తమకే కంప్లెయింట్ చేయొచ్చని చెబుతోంది.
వెలుగు బిజినెస్ డెస్క్: హఠాత్తుగా మీ క్రెడిట్ స్కోరు పడిపోయిందా....కారణం ఏమిటనేది మీ క్రెడిట్ బ్యూరో చెప్పడం లేదా...అక్మస్మాత్తుగా మీ క్రెడిట్ రిపోర్టులో ఏదైనా కొత్త లోన్ అకౌంట్ కనిపించిందా....బ్యూరోను అడిగితే....సంబంధిత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో కనుక్కోండి అని తప్పించుకుంటోందా....ఇలాంటి సమస్యలు ఏవైనా ఎదురైతే ఇప్పుడు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలపై ఆర్బీఐకి కంప్లెయింట్ చేయొచ్చు. మన కంప్లెయింట్లను తగిన టైములో సంతృప్తికరంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు పరిష్కరించకపోతే ఆర్బీఐ వద్దకు మనం వెళ్లొచ్చు.
క్రెడిట్ బ్యూరోలన్నింటిదీ అదే వైఖరి...
సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, క్రిఫ్హైమార్క్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఇచ్చే రిపోర్టులలో ఏవైనా తప్పులుంటే ....బలయిపోవడమే తప్ప....వాటిని పరిష్కరించుకోవడానికి ఇప్పటిదాకా దారి లేదు. కానీ, తాజాగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలన్నింటినీ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీము కిందకి ఆర్బీఐ తేవడంతో ఇప్పుడు కస్టమర్లకు వెసులుబాటు దొరుకుతుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ ఆపరేటర్లు ....అందరినీ ఈ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీము కిందకి గతంలోనే తెచ్చారు. మానిటరీ పాలసీ ప్రకటించే టైములోనే తాజా ప్రకటననూ ఆర్బీఐ చేసింది.
స్కీము ఎలా పనిచేస్తుంది ?
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ ఆపరేటర్లు, ఇప్పుడు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు....వీరిలో ఎవరైనా కస్టమర్ల కంప్లెయింట్లకు తగిన సొల్యూషన్ ఇవ్వడంలో ఫెయిలైతే...ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీము కలగచేసుకుంటుంది. ఆ కస్టమర్ల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటుంది. ముందుగా సంబంధిత క్రెడిట్ బ్యూరోకు తన సమస్యను కస్టమర్ చెప్పుకోవాలి. ఆ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సమస్య పరిష్కారంలో విఫలమైనా లేదా 30 రోజులలో రెస్పాండ్ కాకపోయినా...అప్పుడు ఆ కస్టమరు ఆర్బీఐని సంప్రదించొచ్చు. ఆన్లైన్లోనే కస్టమరు తన కంప్లెయింట్ను ఆర్బీఐకి పంపించుకునే వీలుంది. సీఆర్పీసీ@ఆర్బీఐ.ఓఆర్జీ.ఇన్(crpc@rbi.org.in) మెయిల్ ఎడ్రస్కు కంప్లెయింట్ను పంపించాలి. లేదా, పోస్టులో చండీగఢ్లోని సెంట్రలైజ్డ్ రిసీట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్కు పంపాలి. మరో మార్గమేమంటే, 14448 టోల్ ఫ్రీ నెంబర్పై కాల్ చేయాలి. తాము ఇచ్చిన కంప్లెయింట్ల స్టేటస్ను సీఎంఎస్ పోర్టల్ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు.
పారదర్శకంగా లేని క్రెడిట్ బ్యూరోలు....
దేశంలోని క్రెడిట్ బ్యూరోల పద్ధతులలో పార దర్శకత లేదని అన్సారి చెబుతారు. క్రెడిట్ స్కోరు ఎందుకు తగ్గిపోతోందో చెప్పకపోవడమే కాకుండా, ఏం చేస్తే మళ్లీ తమ క్రెడిట్ స్కోరు బెటరవుతుందో కూడా అవి సూచించడం లేదని పేర్కొన్నారు. ఎవరైనా కస్టమరు తన రిపోర్టులో తప్పుందని క్రెడిట్ బ్యూరోకి చెబితే....అవి సంబంధిత బ్యాంకుతో మాట్లాడుకోమని చెబుతున్నాయి. లేదంటే ఆ కస్టమరు కంప్లెయింట్ను ఆయా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు పంపిస్తున్నాయి.
ట్విటర్లో వాపోయిన కస్టమర్లు
ఆగస్టు 5న జరిగిన ఒక ట్విటర్ స్పేస్ ఈవెంట్లో దేశంలోని నాలుగు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలదీ ఒకటే దారని చాలా మంది వాపోయారు. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీము కిందకి తెచ్చిన ఆర్బీఐ నిర్ణయంపై ఈ ఈవెంట్ను నిర్వహించారు. కంప్లెయింట్లు ఎప్పుడు పరిష్కారమవుతాయో...అసలు పరిష్కారమవుతాయో లేదో కూడా తెలియదని గోడు వెళ్లబోసుకున్నారు.
మొట్టమొదటిసారిగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలలో జవాబుదారీతనం పెరిగేలా ఆర్బీఐ చొరవ తీసుకుంది. ఇప్పటిదాకా దేశంలోని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తమ బాధలు చెప్పుకోవడానికి కూడా కస్టమర్లకు అవకాశం లేకుండా పోయింది. - కషీఫ్ అన్సారి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హన్స్రాజ్ కాలేజ్, యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ