రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు 2023, మే 19న రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఆర్బీఐ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువవిచ్చింది. అప్పటివరకూ రూ.2వేల నోట్లు యధావిధిగా చెల్లుబాటు అవుతాయని తెలిపింది.
ఆ గడువు ముగియడానికి మరో 15 రోజులు మాత్రమే సమయం మిగిలివుంది. ఆ గడువులోపే ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవాలి. మీరు ఎంత మొత్తంలో అయితే రూ.2వేల నోట్లు డిపాజిట్ చేచేస్తారో.. అంతే మొత్తం విలువ గల ఇతర కరెన్సీ తీసుకోవచ్చు. అన్ని బ్యాంకుల శాఖల్లోనూ ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అన్ని బ్యాంకు శాఖలు రూ 2 వేల నోట్లు డిపాజిట్లు, మార్పిడిని అంగీకరిస్తాయి.
- రోజుకు గరిష్ఠంగా రూ. 20వేల వరకు రూ. 2వేల నోట్లను డిపాజిట్ చేసుకోనేందుకు లేదా మార్పిడికి అనుమతించారు.
- బిజినెస్ కరస్పాండెంట్లు రోజుకు ఒక్కో ఖాతాదారునికి రూ. 4వేల రూపాయల వరకు రూ. 2వేల నోట్లను మార్పిడికి అవకాశం కల్పించారు.
- జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాల్లో కూడా రూ. 2వేల నోట్లు డిపాజిట్ చేయవచ్చు.
ఇంకా ఎవరైనా తమ వద్ద రూ. 2వేల నోట్లు కలిగిఉన్నట్లయితే.. చివరి నిమిషంలో హైరానా పడకుండా నోట్ల మార్పిడి చేసుకోగలరని మనవి. గడువు ముగిశాక ఆ నోట్లకు ఎలాంటి వాల్యూ ఉండదు. నిరుపయోగంగా మారతాయి. మీ ఎంత బ్రతిమలాడినా బ్యాంక్ సిబ్బంది మీ విజ్ఞప్తిని పట్టించుకోరు.
Also Read :- ఈవీల కోసం ప్రత్యేక సేల్స్ నెట్వర్క్
సెప్టెంబర్ 1నాటికకి చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 93 శాతం.. బ్యాంకులకు తిరిగొచ్చాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. వీటి విలువ సుమారు రూ.3.32 లక్షల కోట్లని వెల్లడించింది. ఇంకా రూ.0.24 లక్షల కోట్లు విలువ చేసే రూ.2,000 నోట్లు ప్రజల దగ్గర ఉన్నట్లు తెలిపింది.
కాగా, నల్లధనం వెలికితీత పేరుతో 2016 నవంబర్ 8 రాత్రి పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన రీతిలో ప్రకటించిన విషయం తెలిసిందే.