ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకటనతో కొన్ని పెద్ద బ్యాంకులకు ప్రయోజనం కలుగుతుందనే అంచనాలతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం సెషన్లో దూసుకెళ్లాయి. గత ఏడు రోజులుగా పడుతున్న మార్కెట్లకు మానిటరీ పాలసీ ప్రకటన కొత్త జోష్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా వెయ్యికిపైగా పాయింట్లు పెరగడం బాగా కలిసొచ్చింది. దీంతో సెన్సెక్స్ 1,017 పాయింట్లు పెరిగి 57,427 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 1,313 పాయింట్ల దాకా సెన్సెక్స్ ఎగసింది. అలాగే నిఫ్టీ 276 పాయింట్లు జంప్ చేసి 17,094 వద్ద క్లోజయింది.
సెన్సెక్స్లో భారతి ఎయిర్టెల్ టాప్ గెయినర్గా నిలిచింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు నష్టాలతో క్లోజయ్యాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం నాటి నుంచి అటు గ్లోబల్ మార్కెట్లు, ఇటు మన దేశపు మార్కెట్లు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకటన బుల్స్కు కొత్త ఉత్తేజం కల్పించిందని ఎనలిస్టులు చెబుతున్నారు. మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే రెపో రేటు పెంపుదల ఉందని వారు పేర్కొన్నారు.