
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే డిజిటల్ రూపాయిని లాంచ్ చేయనుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని త్వరలోనే ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని ఆర్బీఐ తెలిపింది. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నోట్ను విడుదల చేసింది. దీంట్లో సీబీడీసీ సాంకేతికత, భవిష్యత్తులో దీన్ని ఉపయోగాలు, జారీ విధానం, డిజైన్ ప్రత్యామ్నాయాలు వంటివి ఉన్నాయి. నిర్దిష్ట సందర్భాల్లో వినియోగించడం కోసం డిజిటల్ రూపీని ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టబద్ధమైన కరెన్సీకి ఈ-రూపీ అదనపు వెసులుబాటు మాత్రమేనని ఆర్బీఐ నోట్ పేర్కొంది. బ్యాంకు నోట్లతో పోలిస్తే ఇది ఏ మాత్రం భిన్నమైంది కాదని.. డిజిటల్ రూపంలో ఉండడమే ప్రత్యేకత అని తెలిపింది. దీని వల్ల మరింత సులభంగా, వేగంగా తక్కువ ఖర్చుతో లావాదేవీలు పూర్తవుతాయని చెప్పింది. మొన్నటి బడ్జెట్ లోనే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ కరెన్సీ గురించి ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే డిజిటల్ రూపాయిని ఆర్బీఐ లాంచ్ చేస్తుందని తెలిపారు.