
ముంబై:ఆర్బీఐ అంచనాలకు మించి వడ్డీ రేట్లను తగ్గించడంతో బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం సుమారు ఒక శాతం ర్యాలీ చేశాయి. రేట్ల కోతకు ఎక్కువగా ప్రభావితం అయ్యే రియల్టీ, ఫైనాన్షియల్స్, ఆటో షేర్లు భారీగా పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం 747 పాయింట్లు (0.92 శాతం) పెరిగి 82,189 వద్ద క్లోజ్ అయింది. ఇంట్రాడేలో 858 పాయింట్లు (1.05 శాతం) లాభపడి 82,300 వరకు వెళ్లింది.
నిఫ్టీ 25,000 లెవల్ను తిరిగి చేరుకుంది. 252.15 పాయింట్లు (1.02 శాతం) పెరిగి 25,003.05 వద్ద సెటిల్ అయింది. రియల్టీ ఇండెక్స్ 4.74 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.79 శాతం, మెటల్ 1.56శాతం, ఆటో 1.50శాతం, కన్జూమర్ డిస్క్రిషనరీ 1.38శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ 1.30శాతం, బ్యాంకెక్స్ 1.25శాతం పెరిగాయి. ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి.
‘‘ఆర్బీఐ అనూహ్యంగా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం, సీఆర్ఆర్కు ఒక శాతం కోత పెట్టడంతో మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా మారింది. బలమైన ర్యాలీ కనిపించింది. మధ్యాహ్నం సెషన్లో మాత్రం కొంత రేంజ్-బౌండ్ ట్రేడింగ్ జరిగింది” అని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు.
రానున్న సెషన్లలో కూడా ఈ రేట్ల కోత ప్రభావం మార్కెట్లో కనిపిస్తుందని, వడ్డీ రేట్లకు ఎక్కువ ప్రభావితమయ్యే సెక్టార్లతో (రియల్టీ, ఫైనాన్షియల్స్, ఆటో) పాటు రైల్వే లాంటి సెలెక్ట్ థీమ్స్పై ఇన్వెస్టర్లు ఫోకస్ పెడతారని వివరించారు.
సెన్సెక్స్లో బజాజ్ ఫైనాన్స్ శుక్రవారం 4.93 శాతం ఎగిసింది. యాక్సిస్ బ్యాంక్, మారుతి, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎటర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి.
భారతి ఎయిర్టెల్, సన్ ఫార్మా నష్టాల్లో ముగిశాయి. బ్రాడ్మార్కెట్ అయిన బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.91 శాతం పెరగగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.43 శాతం లాభపడింది.