న్యూఢిల్లీ: వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించే ఆలోచన లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే రూమర్స్పై ఆయన స్పందించారు. ఇన్ఫ్లేషన్ను 4 శాతం దిగువకు తీసుకురావడంపై ఫోకస్ పెడుతున్నామని చెప్పారు. రేట్ల తగ్గింపుపై చర్చ కూడా జరగడం లేదని ఆయన అన్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం స్టార్టయినప్పుడు ఇండియాలో ఇన్ఫ్లేషన్ 7.8 శాతానికి పెరిగిందని, ప్రస్తుతం ఆర్బీఐ పెట్టుకున్న 2–6 శాతం రేంజ్లోకి వచ్చిందని చెప్పారు.
కానీ, ఫోకస్ 4 శాతం దిగువకు తీసుకురావడమని వెల్లడించారు. ‘4 శాతం వైపు కదులుతున్నాం. ఇన్ఫ్లేషన్ నిలకడగా 4 శాతం లోపు ఉన్నంత వరకు రేట్ కట్ గురించి మాట్లాడడం అనవసరం’ అని దాస్ వివరించారు. 2024–25 లో సగటు ఇన్ఫ్లేషన్ 4.5 శాతం ఉంటుందని అన్నారు. ఒడిదుడుకులు ఉంటాయని, ఈ లెవెల్ దగ్గర నిలకడగా ఉంటుందని పేర్కొన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలోని రెండో క్వార్టర్లో ఇన్ఫ్లేషన్ 4 శాతం దిగువకు వస్తుందని డిసెంబర్ మానిటరీ పాలసీ మీటింగ్ (ఎంపీసీ) లో ఆర్బీఐ పేర్కొంది.