బెంగళూరు తొక్కిసలాట కేసులో నలుగురు అరెస్ట్.. ఆర్సీబీ నుండి ఒకరు..

బెంగళూరు తొక్కిసలాట కేసులో నలుగురు అరెస్ట్.. ఆర్సీబీ నుండి ఒకరు..

ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. 11 మంది మరణానికి కారణమైన ఈ తొక్కిసలాటపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ మేనేజ్మెంట్ పై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ( జూన్ 6 ) కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో RCB మేనేజ్మెంట్  నుండి నిఖిల్ సోసాలే, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA నుండి సునీల్ మాథ్యూలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని సీఎం సిద్దరామయ్య ఆదేశించిన క్రమంలో RCB, DNA, సహా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA)పై కేసు నమోదు చేశారు. KSCA అధికారులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు పోలీసులు.ఈ ఘటనకు బాధ్యులుగా భవిస్తూ గురువారం ( జూన్ 5 ) బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ బి దయానందతో పాటు పలువురు సీనియర్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు సీఎం సిద్దరామయ్య. కాగా..  కర్ణాటక హైకోర్టు ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి, జూన్ 10 నాటికి స్థితి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

18 ఏండ్ల తర్వాత ఆర్సీబీ జట్టు మంగళవారం రాత్రి ఐపీఎల్ విజేతగా నిలిచింది. దీంతో ప్లేయర్లందరికీ బుధవారం చిన్న స్వామి స్టేడియంలో కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్​సీఏ) సన్మానం ఏర్పాటు చేసింది. దీన్ని చూసేందుకు లక్షల మంది స్టేడియం వద్దకు తరలి వచ్చారు. సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు.
 
సెక్యూరిటీ గార్డులు స్టేడియం గేట్ నంబర్ 3కు తాళాలు వేయడంతో అభిమానులంతా కలిసి వాటిని బద్దలు కొట్టారు. గేటుపై ఉన్నవాళ్లంతా ఒకరిపై ఒకరు కిందపడిపోయారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ పరుగులు పెట్టారు. ఫలితంగా తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి హెల్త్ కండీషన్ సీరియస్​గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌..  బౌరింగ్ హాస్పిటల్​కు వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.