- 9 కల్లా ఆఫీసులో ఉండాలి.. లేటైతే జీతం కట్: సర్కార్ ఆర్డర్
- అలాగైతే ఇంటి కెళ్లే టైమ్ నూ ఫిక్స్ చేయాలంటున్న ఆఫీసర్లు
- యోగి ప్రభుత్వం కండిషన్లపై బ్యూరోక్రాట్ల అసంతృప్తి
లక్నో: ఆఫీసర్లు కరెక్ట్ టైమ్కు ఆఫీసులో ఉండాలంటూ ఉత్తరప్రదేశ్ సర్కార్ జారీచేసిన ఉత్తర్వులపై ఆ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ‘‘ ఉదయం తొమ్మిది గంటలకే ఆఫీసుకు వస్తాం. మరి ఇంటికి వెళ్లే టైమ్ కూడా ఫిక్స్ చేయండి.. ’’ అని అంటున్నారు బ్యూరోక్రాట్లు. కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులంతా ఉదయం 9 కల్లా తమ ఆఫీసుల్లో ఉండాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీచేశారు. లేట్గా ఆఫీసుల కొస్తే జీతంలో కోత ఉంటుందని సీఎం ఆఫీస్ వార్నింగ్ ఇచ్చింది. కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లంతా ఉదయం 9 నుంచి 11 వరకు ప్రజల్ని కలవాలని కూడా జీవో జారీచేశారు. ఏ అధికారైనా ఈ ఆర్డర్స్ను ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని కూడా సీఎంఓ ట్వీట్ చేసింది.ఈ ఆర్డర్స్పై బ్యూరోక్రాట్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎన్ని గంటలకు ఆఫీసుకు రావాలో నిర్ణయించిన సీఎం.. ఎన్నింటికి ఇంటికి వెళ్లాలో కూడా నిర్ణయిస్తే బాగుండేదని అంటున్నారు.
పని చేయనివాళ్ల వివరాలివ్వండి:
పనిచేయని, అవినీతి పోలీసు అధికారులపైనా ఉక్కుపాదం మోపాలని యూపీ సర్కార్ నిర్ణయించింది. జీతం తీసుకుంటూ పనిచేయనివాళ్లు, అవినీతిలో కూరుకుపోయిన పోలీసు అధికారుల వివరాలను ఈనెల 30 నాటికి అందజేయాలని ఏడీజీ(ఎస్టాబ్లిష్ మెంట్) పీయూష్ ఆనంద్ అన్ని జిల్లాల చీఫ్లకు లెటర్లు పంపించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి 50 ఏళ్లు దాటిన పోలీసులందర్నీ స్క్రీనింగ్ చేయనున్నట్టు కూడా చెప్పారు. ‘‘ జిల్లా ఎస్పీగా వేకువజాము వరకు నేను అందుబాటులో ఉండాలి. నా జిల్లాలో యాక్సిడెంట్ జరిగిందనుకోండి. వేకువజాము 4 గంటల వరకు ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు మరుసటి రోజు ఉదయం 9 గంటలను నేనెలా ఆఫీస్కు వెళ్లగలను? జిల్లాల్లో మేమంతా 24 గంటలూ పనిచేస్తూనే ఉండాలి కదా’’ అని వెస్టర్న్ యూపీకి చెందిన ఓ జిల్లా ఎస్పీ ఆవేదన వ్యక్తంచేశారు.
సామాన్య జనానికి కలెక్టర్లు, ఎస్పీలు అందుబాటులో లేరంటూ వచ్చిన ఫిర్యాదువల్లే ముఖ్యమంత్రి లేటెస్ట్ ఆర్డర్స్ జారీచేశారు. గత ఏడాది కూడా ఆదిత్యనాథ్ సర్కార్ ఇలాంటి ఆర్డర్స్ జారీచేసింది. పట్టించుకోని అధికారులపై యాక్షన్ కూడా తీసుకున్నారు. దీంతో చాలా ఆఫీసర్లు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. పనిలో సామర్థ్యం చూపించడంలేదంటూ 50 ఏళ్లు దాటిన పోలీసు ఆఫీసర్లపై ప్రభుత్వం వేటు వేసింది.ఈమధ్యనే హోం శాఖ సమావేశంలో పాల్గొన్న సీఎం..పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజాయితీలేని పోలీసు అధికారులు సర్కార్కు అవసరంలేదని కూడా తేల్చిచెప్పారు. ‘‘ చీఫ్ మినిస్టర్ మీటింగ్లు రాత్రి పొద్దుపోయేవరకు జరుగుతూనే ఉంటాయి. రాత్రి 11 గంటలకు ఆఫీసర్లు ఇళ్లకు వెళ్తారు. మళ్లీ మరుసటి రోజు 9 గంటలకు వాళ్లు ఆఫీసులకు రావాలంటే ఎలా?’’ అని ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.‘‘ నాకన్నా… నాస్టాఫే ఈ ఆర్డర్స్పై అప్సెట్ అవుతున్నారు. నేను ఆఫీసుకు ఉదయం 9 గంటలకల్లా రావాలంటే, నా డ్రైవర్ ఇంటికి సాయంత్రం ఏడున్నరకల్లా చేరుకోవాలి కదా’’ అని అడిషనల్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పనిలేకుండా ఆఫీస్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని కూడా కొంతమంది ఆఫీసర్లు ప్రశ్నిస్తున్నారు.