
- రియల్ వ్యాపారి శివారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు
ఘట్కేసర్, వెలుగు: తప్పుడు పత్రాలతో ప్లాట్ విక్రయించి మోసం చేశావని అడిగినందుకు ఓ రియల్టర్ కులం పేరుతో తిట్టి, బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో అతనిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సీఐ రాజువర్మ వివరాల ప్రకారం.. రామంతాపూర్ ఇందిరానగర్కు చెందిన పసుల మొగిలయ్య సిటీలోని ఓ హోటల్లో సర్వర్గా పనిచేస్తున్నాడు. ఘట్కేసర్ మండలం నారపల్లిలోని బాబానగర్ కు చెందిన చెరుకు శివారెడ్డి మధ్యవర్తిత్వంతో కట్కూరి ప్రభాకర్ రెడ్డి వద్ద కొర్రెములలోని సర్వే నంబర్ 740/పీ, 741/పీ, 742/పీలో 100 గజాల ప్లాట్ కొనుగోలు చేశాడు.
ఇటీవల ప్రభాకర్ రెడ్డి ఏకశీల నగర్లో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రిమాండ్కువెళ్లడంతో శివారెడ్డిని మొగిలయ్య తన భార్య, స్నేహితుడు కృష్ణారెడ్డితో కలిసి నిలదీశాడు. ప్లాట్ కోసం పెట్టుబడి పెట్టిన డబ్బులను తిరిగిచ్చేయాలని కోరాడు.
దీంతో మొగిలయ్యను శివారెడ్డి కులంపేరుతో దూషించడమే కాకుండా తనకు పోలీసులు, రాజకీయ నాయకులు, అధికారులు తెలుసని, ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితుడు శుక్రవారం పోచారం పోలీసులను ఆశ్రయించగా, శివారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.