
- ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నా నో రెస్పాన్స్
- అయోమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు
- కేసీఆర్, కేటీఆర్ను కాదని నోరువిప్పని సీనియర్లు
- ఫామ్హౌస్లో కేసీఆర్తో మళ్లీ హరీశ్ మంతనాలు
- కాళేశ్వరం కమిషన్ విచారణ, కవిత ఎపిసోడ్పైనా చర్చ!
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్పై ఆ పార్టీ చీఫ్, ఆమె తండ్రి కేసీఆర్ మౌనం వహిస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నా, ప్రత్యర్థి పార్టీలు విమర్శల దాడులు చేస్తున్నా కేసీఆర్ సైలెంట్గా ఉంటున్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు పార్టీకి భారీ స్థాయిలో నష్టం కలిగించినా, ఆ వ్యాఖ్యలు చేసి రెండ్రోజులు గడుస్తున్నా కేసీఆర్ మౌనం వీడట్లేదు. దీంతో డాటర్ అంత తీవ్రమైన ఆరోపణలు చేసినా.. డాడీ ఎందుకు సైలెంట్గా ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
కవిత కామెంట్లు చేసినప్పుడే ఆమెను ఫామ్హౌస్కు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడతారని బీఆర్ఎస్ నాయకులు భావించారు. కానీ, కేసీఆర్ ఆమెను పిలవలేదు సరికదా.. హరీశ్రావును పిలిపించుకొని తాజా పరిణామాలపై చర్చించారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక కేడర్లో ఆందోళన నెలకొన్నది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. శుక్రవారం మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె.. గురువారం చేసిన ఆరోపణలే రిపీట్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మౌనం.. పార్టీకి నష్టం చేకూరుస్తుందని పలువురు సీనియర్నేతలు ఆవేదన చెందుతున్నారు.
అనుచరుల వద్ద ఆవేదన..
పార్టీలో ఇంత జరుగుతున్నా తన తండ్రి నుంచి కనీసం పిలుపు రాకపోవడం కవితకు ఏమాత్రం మింగుడుపడడం లేదని ఆమె అనుచరులు అంటున్నారు. తాను రాసిన లేఖకు స్పందించకపోగా, దూతలతో రాయబారం ఎందుకన్న ప్రశ్నలను కవిత వేస్తున్నట్టు తెలిసింది. పార్టీలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడానికి కూడా కేసీఆర్ఇష్టపడడం లేదా? అని తన సన్నిహితుల వద్ద ఆమె వాపోయినట్టు సమాచారం. నేరుగా పిలిచి మాట్లాడితే పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు కవిత సిద్ధంగా ఉన్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు.
కానీ కేసీఆర్ నుంచి స్పందన లేకపోవడంతో కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ క్యాడర్ను సైతం దగ్గరకు రానివ్వడం లేదన్న చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరుగుతున్నదని కవిత మరోసారి ఆరోపించారు. శుక్రవారం మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె.. మార్గమధ్యలో పెద్దపల్లి వద్ద ఆగారు. అక్కడికి స్వాగతం పలికేందుకు వచ్చిన బీఆర్ఎస్క్యాడర్ను కవిత కనీసం పట్టించుకోలేదు.
సొంతంగానే పోరాటాలు..
ప్రస్తుత పరిస్థితుల్లో కవిత కొన్నాళ్లు సొంతంగానే కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. జాగృతి ఆధ్వర్యంలోనే పోరాటాలు చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్టు టాక్ నడుస్తున్నది. అందులో భాగంగానే పార్టీ క్యాడర్కు దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతున్నది. ఇటీవల హైదరాబాద్లో సింగరేణి జాగృతి ఏర్పాటు సందర్భంగా టీబీజీకేఎస్నాయకులను కాకుండా యూనియన్లో యాక్టివ్గా ఉన్న యువ కార్మికులను పిలిపించుకోవడం ఇందుకు ఊతమిస్తున్నది. అదే సమయంలో కలిసి వచ్చే బీసీ సంఘాలు, నేతలతో ముందుకు వెళ్లాలన్న యోచనలో కవిత ఉన్నట్టు ఆమె అనుచరులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో పార్టీ సీనియర్లీడర్లు నారాజ్ అవుతున్నట్టు తెలుస్తున్నది.
నోరువిప్పని సీనియర్లు..
కవిత ఎపిసోడ్పై మాట్లాడాల్సి వస్తే కేసీఆర్లేదంటే కేటీఆర్ మాత్రమే మాట్లాడాల్సి ఉంటుందని కొందరు సీనియర్లీడర్లు చర్చించుకుంటున్నారు. వాళ్లను కాదని ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉందని వాళ్లు అంటున్నారు. ఒకవేళ ఏదైనా మాట్లాడితే, అది మళ్లీ నెగెటివ్అయ్యి తమకే తగులుతుందని ఆందోళన చెందుతున్నారు. గురువారం తెలంగాణ భవన్లో ప్రెస్మీట్ పెట్టిన పార్టీ సీనియర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డిని కవిత ఎపిసోడ్పై మీడియా ప్రశ్నించగా.. ఆ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని ఆమె బదులిచ్చారు. ఇలాగే చాలామంది సీనియర్లీడర్లు అధిష్టానం స్పందన కోసం ఎదురుచూస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
కేటీఆర్ కూడా మౌనం
ఈ అంశంపై మాట్లాడేందుకు పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అందుబాటులో లేరు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం లండన్లో ఉన్న కేటీఆర్.. శనివారం అమెరికాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే కవిత ఎపిసోడ్పై కేటీఆర్ కూడా అక్కడి నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొన్నది. అసలు పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన తమ నేతల మధ్య ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయా? అని చర్చించుకుంటున్నారు.
కేసీఆర్తో హరీశ్ భేటీ..
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో ఎమ్మెల్యే హరీశ్రావు మరోసారి భేటీ అయ్యారు. శుక్రవారం ఫామ్హౌస్లో కేసీఆర్తో ఆయన సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీళ్లిద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకున్నది. కాళేశ్వరం కమిషన్ విచారణ దగ్గరపడుతున్న నేపథ్యంలో కేసీఆర్, హరీశ్ ప్రధానంగా దానిపైనే చర్చించారని బయటకు చెబుతున్నప్పటికీ, కవిత ఎపిసోడ్పైనా చర్చించి ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. కవిత అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నదన్న చర్చ వాళ్లిద్దరి మధ్య జరిగినట్టు తెలిసింది. ఆమె సొంతంగానే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారా? లేదంటే వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా? అన్న అంశంపైనా చర్చ జరిగినట్టు సమాచారం.