- ఇన్వెస్టర్లకు భారీ లాభాలను ఇస్తున్న ఐపీఓలు
- 252 % ఎక్కువ రేటుతో లిస్టింగ్ అయిన సిగాచి
- పారశ్ డిఫెన్స్, జీఆర్ ఇన్ఫ్రా వంటి షేర్లు 100% కంటే ఎక్కువ ప్రీమియంతో లిస్టింగ్
బిజినెస్డెస్క్, వెలుగు: ఐపీఓలు దుమ్ములేపుతున్నాయి. భారీ ప్రీమియంతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను తెస్తున్నాయి. సోమవారం మూడు కంపెనీల లిస్టింగ్ జరగగా, రెండు కంపెనీలు ఇన్వెస్టర్లను లాభాల బాట పట్టించాయి. ఫార్మా కంపెనీ సిగాచి ఇండస్ట్రీస్ అయితే మార్కెట్లోకి ఎంటర్ అవుతూనే ఇన్వెస్టర్లకు 252 శాతం రిటర్న్ను ఇచ్చింది. అక్కడి నుంచి మరో 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ను టచ్ చేసింది. పాలసీబజార్ (పీబీ ఫిన్టెక్) షేర్లు 17 శాతం ప్రీమియంతో, ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ షేర్లు ఫ్లాట్గా లిస్ట్ అయ్యాయి. మొత్తంగా చూస్తే ఐపీఓల హవా ఇంకా పోలేదని తెలుస్తోంది. నైకా షేర్లు మొదటి రోజే 80 శాతం పెరగడాన్ని చూశాం. ఇంకా మరిన్ని కంపెనీలు మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. గతంలో కూడా చాలా ఐపీఓలు భారీ ప్రీమియంతో మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. తాంటియా కన్స్ట్రక్షన్స్, జీసీఎం, ఎఫ్సీఎస్ సాఫ్ట్వేర్ వంటి షేర్లు 200 శాతానికి పైగా లాభంతో మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ, ఇంద్రప్రస్థ గ్యాస్, సాల్సర్ టెక్నో ఇంజినీరింగ్, ఆస్ట్రన్ పేపర్ అండ్ బోర్డ్ మిల్, టీవీ టుడే నెట్వర్క్ వంటి కంపెనీలు 100 శాతానికి పైగా ప్రీమియంతో ఎంట్రీ ఇచ్చాయి. ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. నందన్ డెనిమ్, కెమ్కన్ స్పెషాలిటీ కెమికల్స్, ప్రెవెస్ట్ డెన్ప్రో, హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, జీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, రూట్ మొబైల్స్, అవెన్యూ సూపర్మార్ట్స్(డీమార్ట్), ఐఆర్సీటీసీ షేర్లు కూడా మార్కెట్లోకి 100 శాతం లాభంతో ఎంటర్ అయ్యాయి.
200 % లాభంతో లిస్ట్ అయిన షేర్ల పరిస్థితి..!
భారీ ప్రీమియంతో లిస్ట్ అయిన షేర్లలో సిగాచి కంటే ముందు తాంటియా కన్స్ట్రక్షన్స్ ఉంది. ఈ కంపెనీ షేర్లు 2006, ఏప్రిల్లో మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. 260 శాతం ప్రీమియంతో ఎంట్రీ ఇచ్చిన తాంటియా, ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను ఇచ్చింది. ఈ కంపెనీ ఐపీఓ ధర రూ. 50 అయితే షేరు రూ. 180 వద్ద లిస్ట్ అయ్యింది. కానీ, ఈ షేరు ప్రస్తుతం పెన్నీ షేరుగా మారడాన్ని గమనించాలి. ప్రస్తుతం ఐపీఓ రేటు కంటే 83 శాతం తగ్గి రూ. 8.70 వద్ద ట్రేడవుతోంది. ఇలానే జీసీఎం సెక్యూరిటీస్ 2013 లో, ఎఫ్సీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ 2005 లో 200 % కంటే ఎక్కువ ప్రీమియంతో మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఈ రెండు షేర్లు కూడా ప్రస్తుతం రూ. 1.70, రూ. 2 వద్ద ట్రేడవుతున్నాయి. దీన్ని బట్టి భారీ ప్రీమియంతో మార్కెట్లో లిస్ట్ అయినా, లాంగ్ టెర్మ్లో కూడా అదే ట్రెండ్ను కొనసాగుతుందని అనుకోకూడదని ఎనలిస్టులు చెబుతున్నారు. బిజినెస్ను మరింత విస్తరించాలని ప్రమోటర్లకు ఉండాలని, ఆ ఆలోచన లేకపోతే భారీ ప్రీమియంతో లిస్ట్ అయిన షేర్లు కూడా పెన్నీ షేర్లుగా మారిపోతాయని అంటున్నారు. మరోవైపు భారీ లాస్తో మార్కెట్లోకి ఎంటర్ అయిన షేర్లూ లేకపోలేదు. నెక్స్ట్ మీడియా వర్క్స్ 43 % నష్టంతో 2001 మార్కెట్లో లిస్ట్ అయ్యింది. విశ్వాని ఇండస్ట్రీస్, రతి స్టీల్ అండ్ పవర్, బోన్లాన్ ఇండస్ట్రీస్, ఎస్ఎస్పీఎన్ ఫైనాన్స్, యూఎస్ జావేరి, కార్డ కన్స్ట్రక్షన్స్, ఆమ్సన్స్ అపారల్స్, ఆల్ కార్గో లాజిస్టిక్స్, కాడిలా హెల్త్కేర్ షేర్లు 20-–32 శాతం నష్టంతో మార్కెట్లో లిస్ట్ అయ్యాయి.
పర్వాలేదనిపించిన లిస్టింగ్.. ఇన్వెస్టర్లకు సిగాచి బొనాంజా
సిగాచి షేర్లు సోమవారం రికార్డ్ను క్రియేట్ చేశాయి. కంపెనీ షేర్లు ఐపీఓ ధర రూ. 163 కంటే ఏకంగా 252 శాతం ఎక్కువ రేటుతో రూ. 570 వద్ద ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యాయి. అక్కడి నుంచి మరో 5% పెరిగి రూ. 598.50 వద్ద అప్పర్ సర్క్యూట్ను టచ్ చేసింది. ఐపీఓ హిస్టరీలో భారీ ప్రీమియంతో లిస్టింగ్ అయిన షేర్లలో సిగాచి రెండో ప్లేస్లో నిలిచింది. షార్ట్ టెర్మ్ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అని ఎనలిస్టులు సలహాయిస్తున్నారు
పాలసీబజార్ ఓకే..
ఇన్సూరెన్స్ వంటి ఫైనాన్షియల్ సర్వీసులు అందజేసే పాలసీబజార్ (పీబీ ఫిన్టెక్) షేర్లు ఐపీఓ ధర రూ. 980 కంటే 17.35% ప్రీమియంతో రూ. 1,150 వద్ద ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యాయి. ఆ తర్వాత మరో 5 % పెరిగి రూ. 1,202 వద్ద ముగిశాయి. లాంగ్టెర్మ్లో పీబీ ఫిన్టెక్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతుందని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ వికాస్ జైన్ పేర్కొన్నారు. వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్నా,ఈ కంపెనీ షేర్లను ఇన్వెస్టర్లు హోల్డ్ చేయాలని సలహాయిచ్చారు. ‘ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలకు, కొత్త తరం ఇంటర్నెట్ కంపెనీలకు మంచి డిమాండ్ ఉంది. నైకా, పీబీ ఫిన్టెక్ లిస్టింగ్ను చూస్తే ఈ విషయం అర్థమవుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.
ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్..
ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ షేర్లు మార్కెట్లో ఫ్లాట్గా లిస్టింగ్ అయ్యాయి. ఆ తర్వాత మరో 6.13 శాతం నష్టపోయాయి. కంపెనీ షేర్లు ఐపీఓ ధర రూ. 542 కంటే 0.36 శాతం తగ్గి రూ. 540 వద్ద ఫ్లాట్గా ఎంట్రీ ఇచ్చాయి. చివరికి రూ. 510 వద్ద తమ మొదటి సెషన్ను ముగించాయి.