వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగింట మూడో వంతు ఈ ఏడాది రెసిషన్లో ఉంటుందని ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) పేర్కొంది. యూఎస్, ఈయూ (యూరోపియన్ యూనియన్), చైనా దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగిస్తాయని తెలిపింది. సీబీఎస్ వార్తా కార్యక్రమం "ఫేస్ ది నేషన్" సందర్భంగా ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా ఆదివారం ఈ కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్లో కొనసాగుతున్న ఘర్షణ తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించడం లేదు. ఇన్ఫ్లేషన్, అధిక వడ్డీ రేట్లకు తోడు ఒమిక్రాన్ వేరియంట్ ద్వారా చైనాలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. పోయిన ఏడాది కంటే2023 మరింత ఇబ్బందికరంగా ఉంటుందని ఆమె అన్నారు.
రెసిషన్ లేని దేశాల్లోని కోట్లాది మంది జనం పైన దాని ఎఫెక్ట్ ఉంటుందని అన్నారు. వచ్చే రెండు నెలలు చైనాకు ఇబ్బందులు కొనసాగుతాయని, ఆర్థికవృద్ధిపై ప్రభావం ప్రతికూలంగా ఉంటుందని వివరించారు. ప్రపంచ వృద్ధిపైనా ప్రభావం ప్రతికూలంగానే ఉంటుందని జార్జివా స్పష్టం చేశారు. ఐఎంఎఫ్ పోయిన ఏడాది అక్టోబర్లో 2023 కోసం వృద్ధి అంచనాను తగ్గించింది. ప్రపంచ వృద్ధి 2021లో 6 శాతం నుంచి 2022లో 3.2 శాతానికి 2023లో 2.7 శాతానికి మార్చివేసింది. ఇండియా వృద్ధి అంచనాలనూ మార్చింది.