మంచిర్యాల జిల్లాలో ముగిసిన కొనుగోళ్లు .. రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ

మంచిర్యాల జిల్లాలో ముగిసిన కొనుగోళ్లు .. రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ
  • 1.99 లక్షల టన్నులు.. రూ.422.52 కోట్లు 
  • నిరుటి కంటే 54 వేల మెట్రిక్​ టన్నులు అధికం
  • ఇప్పటివరకు ఖాతాల్లో రూ.364.55 కోట్లు జమ
  • నిర్మల్​ జిల్లాలో రెండ్రోజుల్లో ముగియనున్న కొనుగోళ్లు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసింది. ఈసారి రికార్డు స్థాయిలో లక్షా 99 వేల మెట్రిక్​ టన్నుల వడ్లను 31,702 మంది రైతుల నుంచి సేకరించారు. నిరుడు ఇదే సీజన్​లో లక్షా 55 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేయగా.. ఈసారి54 వేల టన్నులు అధికంగా సేకరించారు. రూ.422.52 కోట్లకు గాను ఇప్పటివరకు రైతుల అకౌంట్లలో రూ.364.55 కోట్లు జమ చేశారు. ట్యాబ్​ఎంట్రీ చేయగానే రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తున్నారు. మరో వారం రోజుల్లో చెల్లింపులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. 

యాసంగిలో దొడ్డు రకాలకే మొగ్గు

సన్నాలు క్వింటాలుకు  కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 బోనస్​ ప్రకటించడంతో గత వానాకాలం సీజన్​లో రైతులు అంచనాలకు మించి సన్నాలు సాగు చేశారు. కానీ యాసంగిలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మెజారిటీ రైతులు దొడ్డు రకాలకే మొగ్గుచూపారు. ఈ సీజన్​లో లక్షా 14 వేల774 ఎకరాల్లో దొడ్డు రకాలు వేయగా, సన్నాలు కేవలం 6,928 ఎకరాల్లోనే వేశారు. మొత్తం లక్షా 21 వేల 702 ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. కామన్​రకం ఎకరానికి 27.80 క్వింటాళ్ల చొప్పున 3 లక్షల 25 వేల 255 టన్నులు, ఫైన్​రకం ఎకరానికి 20.40 క్వింటాళ్ల లెక్కన 16వేల 540 టన్నులు, మొత్తం 3 లక్షల 41 వేల 795 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో స్థానిక వినియోగం, సీడ్​ఉత్పత్తి, రైస్​ మిల్లర్లు కొనుగోలు చేసేది 21వేల 905 టన్నులుగా అంచనా వేయగా, 3 లక్షల 31 వేల 935 టన్నులు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని టార్గెట్​ పెట్టుకున్నారు. కానీ 2 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సెంటర్లకు వచ్చినట్టు కొనుగోళ్ల లెక్కలు 
చెబుతున్నాయి.

పొరుగు జిల్లాలకు తరలింపు

యాసంగి సీజన్​లో మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 345 కొనుగోలు కేంద్రాలను ఓపెన్​ చేసి ధాన్యం సేకరించారు. అయితే జిల్లాలో యాసంగి సీజన్​ ఆలస్యంగా ప్రారంభం కావడంతో వరికోతలు లేట్​ అయ్యాయి. ఇది ధాన్యం సేకరణపై ప్రభావం చూపింది. మే నెలాఖరులో అకాల వర్షాలు కురవడంతో ధాన్యం సేకరణకు ఆటంకం ఏర్పడి రైతులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు సేకరించిన ధాన్యాన్ని పొరుగు జిల్లాలకు తరలించడానికి లారీల సమస్య ఎదురైంది. వడ్లు తడిసాయనే సాకుతో మిల్లర్లు క్వింటాలుకు రెండు మూడు కేజీల చొప్పున కట్​ చేసినట్టు పలువురు రైతులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 19 రా, 35 బాయిల్డ్​ మిల్లులు ఉన్నప్పటికీ వీటిలో 22 మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించారు. మిగిలిన వాటిలో దాదాపు 23 డీఫాల్ట్​ మిల్లులు కావడంతో వాటికి ఈసారి ధాన్యం నిలిపివేశారు. దీంతో మిగిలిన వడ్లను పెద్దపల్లి జిల్లాలోని 110 మిల్లులతో పాటు కరీంనగర్​జిల్లాలోని 68 మిల్లులకు తరలించారు.  

నిర్మల్ ​జిల్లాలో ఇలా..

నిర్మల్​జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరో రెండ్రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామని సివిల్ సప్లయీస్ డీఎం తెలిపారు. ఇప్పటివరకు 1,85,000 మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని,  ఈ ధాన్యం విలువ రూ.427 కోట్లు కాగా.. రైతులకు రూ.267 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు.

నిర్మల్​ జిల్లాలో..

వడ్ల దిగుబడి లక్ష్యం:    1.65 లక్షల
                                             మెట్రిక్ ​టన్నులు
కొనుగోలు చేసింది :    1.85 లక్షల 
                                              మెట్రిక్​ టన్నులు 
ధాన్యం విలువ:              రూ.427 కోట్లు
రైతులకు చెల్లించింది: రూ.267 కోట్లు

 మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వివరాలు  

ఏజెన్సీ సెంటర్లు సేకరించిన వడ్లు (మె.ట) విలువ (కోట్లలో)  

ఐకేపీ     167     1,08,609.840    2,41,93,82,304 
పాక్స్​     106    43,928.760    87,79,11,200 
మెప్మా     07    8,035.960    18,23,56,640 
డీసీఎమ్మెస్​     65    38,809.280    74,56,09,024 
మొత్తం     345    1,99,383.480    4,22,52,59,168