న్యూఢిల్లీ : ఎర్ర సముద్రంలో నెలకొన్న సంక్షోభంతో షిప్పింగ్ ధరలు 60 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇన్సూరెన్స్ ప్రీమియం మరో 20 శాతం పెరగొచ్చని జీటీఆర్ఐ రిపోర్ట్ వెల్లడించింది. ఎర్ర సముద్రం, మెడిటేరియన్ సముద్రంను హిందూ మహాసముద్రానికి కలిపే కీలక జలసంధి బాబ్ ఎల్ మండెబ్ వద్ద ఉద్రిక్తతలు పెరిగాయి. యెమెన్ హౌతి మిలిటెంట్స్ అటాక్స్ ఎక్కువవ్వడంతో ఈ రూట్లో రవాణా కష్టంగా మారింది.
దీంతో షిప్పర్లు కేప్ ఆఫ్ గుడ్ హోప్కు మారి, అక్కడి నుంచి రవాణా మొదలు పెట్టారు. దీంతో 20 రోజుల వరకు అదనపు టైమ్ పడుతుందని జీటీఆర్ఐ వెల్లడించింది. హౌతి దాడులతో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూరప్కు ఇండియాకు మధ్య జరుగుతున్న వ్యాపారంపై ప్రభావం పడుతోందని పేర్కొంది. క్రూడాయిల్, ఎల్ఎన్జీ ఇంపోర్ట్స్ కోసం ఇండియా ఎక్కువగా బాబ్ ఎల్ మండెబ్ జల సంధిపై ఆధారపడుతోంది.
యూరప్, నార్త్ అమెరికాతో జరుగుతున్న గూడ్స్ రవాణాలో 50 శాతానికి పైగా దిగుమతులు, 60 శాతం ఎగుమతులు అంటే మొత్తం113 బిలియన్ డాలర్ల వ్యాపారానికి ఈ రూట్ చాలా కీలకమని జీటీఆర్ఐ వెల్లడించింది. దీంతో ఇతర మార్గాల వైపు ఇండియా చూడాల్సి వస్తోందని తెలిపింది. ఎర్ర సముద్రంలోని షిప్ల కోసం ఇండియా సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వీటి రవాణాను ముఖ్యంగా గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు చేపడుతున్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది.