పెట్​ షాపులకు రిజిస్ట్రేషన్​ మస్ట్​

పెట్​ షాపులకు రిజిస్ట్రేషన్​ మస్ట్​

హైదరాబాద్​, వెలుగు: సిటీలో జాతి కుక్కుల పేరిట దందా జోరుగా సాగుతోంది. వీరికి పెట్ ఫుడ్ నిర్వాహకులు,  కొందరు వెటర్నరీ డాక్టర్లు సహకరిస్తున్నారు. ఏడాది కాలంగా ఈ బిజినెస్ భారీగా పెరిగింది. ఒక్కో కుక్క పిల్లను వేలల్లో అమ్ముతున్నారు.  ఎలాంటి పర్మిషన్లు లేకుండా అమ్మే వారికి చెక్​పెట్టేందుకు యానిమల్​వెల్ఫేర్​బోర్డు, బల్దియా చర్యలకు సిద్ధమయ్యాయి.  ఇప్పటివరకు పర్మిషన్లు తీసుకోని పెట్ షాపులు, డాగ్ బ్రీడర్స్(కుక్కల పెంపకం దారులు, అమ్మకం దారులు) యానిమల్​ వెల్ఫేర్​బోర్డు వద్ద తప్పనిసరిగా రిజిస్ర్టేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్​ ఉంటేనే బల్దియా వెటర్నరీ అధికారులు షాపులకు లైసెన్స్​లు ఇస్తారు.  ఇప్పటికే గ్రేటర్​లో 82 పెట్​ షాపులకు, 9 డాగ్​ బ్రీడర్స్​కు బల్దియా నోటీసులు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా యానిమల్ వెల్ఫేర్​బోర్డు లైసెన్స్​లు పొందని షాపులను సీజ్ చేయనుంది.  సిటీలో కొందరు అనుమతులు లేకుండానే జంతువులు, పక్షులను అమ్ముతున్నట్లు కొందరు పెట్​షాప్స్, డాగ్​బ్రీడర్స్ ​నిర్వాహకులు ఆయా డిపార్ట్​మెంట్ల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు కంప్లయింట్ చేయడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే యానిమల్​వెల్ఫేర్​బోర్డు పర్మిషన్​తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టారు. 

 రెండు శాఖల తనిఖీలు 

పెట్​షాపులు, డాగ్​బ్రీడర్స్​సెంటర్లలో బల్దియా అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. జంతువులు, పక్షులను రూల్స్​ ప్రకారం పెంచుతున్నారా? లేదా? ఎలాంటి వాటిని అమ్ముతున్నారో చెక్ ​చేస్తున్నారు. రాత్రిపూట జంతువులు, పక్షులకు కావాల్సిన లైటింగ్ ఏర్పాట్లను కూడా చూస్తున్నారు. ఇప్పటి వరకు77 పెట్ షాపు, 8 డాగ్​బ్రీడర్స్​నిర్వాహకులు రిజిస్ట్రేషన్లకు అప్లయ్ చేసుకున్నారు. మరోవైపు యానిమల్​వెల్ఫేర్​బోర్డు అధికారులు సమాచారం ఇవ్వకుండానే వెళ్లి షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అన్నీ కరెక్ట్​గా ఉన్న షాపులకు క్లియరెన్స్ ​ఇస్తున్నారు. 

నెలాఖరు లోపు లెసెన్స్​లు పొందాలె 

ఈ నెలాఖరు లోపు అన్ని పెట్​ షాపులు, డాగ్​బ్రీడర్స్ నిర్వాహకులు బల్దియా వద్ద లైసెన్స్​లు పొందాల్సి ఉంది. లేకుంటే షాపులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. లైసెన్స్​ తీసుకునే ముందు యానిమల్​ వెల్ఫేర్​బోర్డులో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి  లేదా అప్లయ్ అయినా చేసుకొని ఉండాలి.​