
- ఫైనల్లో సత్తాచాటేందుకు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న కంటెస్టెంట్స్
- ఆదివారం గ్రాండ్ ఫినాలే
హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఫైనల్స్కోసం హోటల్ ట్రైడెంట్ లో రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. శుక్రవారం రోజంతా, శనివారం ఉదయం వరకు పోటీదారులు రిహార్సల్స్ కొనసాగించనున్నారు. ఫైనల్ వేదికపై సత్తాచాటేందుకు ముద్దుగుమ్మలు ఒకరిని మించి ఒకరు ప్రాక్టీస్ చేస్తున్నారు. గురువారం కొందరు కంటెస్టెంట్స్ అరబిందో, రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శనకు వెళ్లినట్టు తెలిసింది. కాగా, మిస్ ఇండియా బ్యూటీ నందిని గుప్తాకు సామాజిక మాధ్యమాల్లో అభిమానుల నుంచి ‘ఆల్ ద బెస్ట్ ’ పోస్టులు ముంచెత్తుతున్నాయి.
కాగా, ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుండగా.. ఇంకా న్యాయనిర్ణేతలు ఫైనల్ కు చేరిన అందాలభామల వివరాలు వెల్లడించలేదు. మధ్యమధ్యలో కంటెస్టెంట్స్ నగరంలో పర్యటిస్తున్న వివరాలను సైతం అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఫైనల్స్ కు పోటీదారులకు మల్టీ మీడియా చాలెంజ్ టాస్క్ నిర్వహించారు. ఇందుకోసం 20 మందిని ఎంపిక చేశారు. ఇన్ స్టాగ్రామ్, మిస్ వరల్డ్ యాప్, వారి ఫేస్ బుక్ పేజీలలో యాక్టివ్ గా ఉన్నవారిని ఒక్కో ఖండం నుంచి ఐదుగురిని ఎంపిక చేశారు. వీరికి ఫైనల్ గా ఒక చాలెంజ్ ను నిర్వాహకులు ఇచ్చారు.
మిస్ వరల్డ్ పోటీలు, వారి అనుభవం, తదితర అంశాలపై తక్కువ నిడివితో వీడియో చేయాలి. గురువారం ఈ వీడియోను మిస్ వరల్డ్ యాప్ లో అప్ లోడ్ చేశారు. ఇందులో ఎవరి వీడియోకు ఎక్కువ వ్యూస్, లైక్ వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోవడంతోపాటు వారి కంటెంట్ను బట్టి వారిలో ఒకరిని విజేతగా ప్రకటిస్తారు.