
న్యూఢిల్లీ: వజీరిస్తాన్ ఉగ్రదాడి దాడి వెనక భారత్ హస్తముందని పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. వజీరిస్తాన్ దాడితో మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ ఆదివారం (జూన్ 29) సోషల్ మీడియా ప్లాట్ఫామ్ (ట్విట్టర్) ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘జూన్ 28న వజీరిస్తాన్లో జరిగిన దాడికి భారతదేశాన్ని నిందించడానికి పాకిస్తాన్ సైన్యం ప్రయత్నిస్తున్నది. దీనిని ధిక్కారంతో మేం తిరస్కరిస్తున్నాం’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, శనివారం (జూన్ 28) పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో టెర్రర్ ఎటాక్ జరిగిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ సైనిక కాన్వాయ్పై ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. భారీగా పేలుడు పదార్థాలు నింపిన ఓ వాహనాన్ని ఆర్మీ కాన్వాయ్కి ఢీకొట్టారు. ఈ దాడిలో 13 మంది సైనికులను మృతి చెందారు. మరో10 మంది సైనిక సిబ్బంది, 19 మంది సామాన్య పౌరులు గాయపడ్డారు.
పాకిస్తాన్కు చెందిన తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్కు చెందిన సబ్ గ్రూప్ ఉసుద్ అల్-హర్బ్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన జారీ చేసింది. కానీ దాయాది పాకిస్థాన్ మాత్రం ఈ ఘటన వెనక భారత్ ఉందని విషం వెళ్లగక్కింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఆరోపణలను భారత్ ధీటుగా తిప్పికొట్టింది.