న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్(ఏఐ) సూపర్ కంప్యూటర్స్తయారు చేయడానికి యూఎస్ టెక్నాలజీ కంపెనీ ఎన్విడియాతో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ చేతులు కలిపింది. ప్రస్తుతం ఉన్న సూపర్ కంప్యూటర్కంటే ఇది చాలా శక్తిమంతంగా ఉంటుందని తెలిపాయి. ఈ ప్రకటనకు ఒక రోజు ముందు ఎన్విడియా ఫౌండర్ జెన్సెన్ హువాంగ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ఎన్విడియా మనదేశంలో 2004లో అడుగుపెట్టింది. దీనికి గుర్గావ్, హైదరాబాద్, పుణే, బెంగళూరులో ఇంజనీరింగ్ డెవెలప్మెంట్ సెంటర్లు, 3,800 మంది ఉద్యోగులు ఉన్నారు. అన్ని ఇండియా భాషల్లో పనిచేయగలిగిన, జెనరేటివ్ ఏఐ అప్లికేషన్స్కు అనువుగా ఉండే కంప్యూటర్ను తయారు చేస్తామని రిలయన్స్, ఎన్విడియా ప్రకటించాయి. ఎన్విడియా అత్యంత అధునాతన జీహెచ్200 గ్రేస్ హాప్పర్ సూపర్ చిప్ డీజీఎక్స్ క్లౌడ్, క్లౌడ్లోని ఏఐ సూపర్ కంప్యూటింగ్ సర్వీస్కు యాక్సెస్ను అందిస్తుంది. " రిలయన్స్ 45 కోట్ల మంది జియో కస్టమర్ల కోసం ఏఐ అప్లికేషన్లను, సేవలను సృష్టిస్తోంది.
భారతదేశం అంతటా సైంటిస్టులు, డెవలపర్లు స్టార్టప్లకు సమర్థవంతమైన ఏఐ మౌలిక సదుపాయాలను అందిస్తుంది" అని ప్రకటన పేర్కొంది. రైతులు వారి స్థానిక భాషలో వాతావరణ సమాచారం, పంట ధరల వివరాలను పొందడానికి ఏఐ సహాయపడుతుంది. డాక్టర్లు అందుబాటులో లేని చోట ఇమేజింగ్ స్కాన్, డయాగ్నసిస్ సేవలను అందించగలుగుతుంది. దశాబ్దాల వాతావరణ డేటాను ఉపయోగించి తుఫానులను అంచనా వేస్తుంది. కొత్త ఏఐ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రూపొందించడానికి, నిర్వహించడానికి నైపుణ్యం, మౌలిక సదుపాయాలు, ఇంజనీరింగ్ సదుపాయాలు తమకు ఉన్నాయని జియో తెలిపింది.
సెమీ కండక్టర్లూ
తయారు చేయనున్న రిలయన్స్ ?
రిలయన్స్ సెమీకండక్టర్ల తయారీలోకి కూడా అడుగుపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తన కంపెనీ సప్లై చెయిన్ అవసరాలను, చిప్లకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ఈ రంగంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటోందని ఈ విషయం తెలిసినవాళ్లు వెల్లడించారు. విదేశీ చిప్ మేకర్లతో టెక్నాలజీ పార్ట్నర్షిప్ల కోసం ఈ కంపెనీ ఇది వరకే చర్చలు జరిపినా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదని తెలిపారు. సెమీకండక్టర్ల తయారీ గురించి అడిగిన ప్రశ్నకు స్పందించడానికి రిలయన్స్ ప్రతినిధి, కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆఫీసు ఇష్టపడలేదు. ఇండియా ప్రపంచానికి చిప్మేకర్గా మారాలని తాను కోరుకుంటున్నట్లు మోదీ ఇది వరకే ప్రకటించారు.